హత్యతో ఉలిక్కిపడ్డ భద్రాచలం ఏజెన్సీ.. వారిని అక్కడకు వెళ్లోద్దన్న పోలీసులు

by  |
ramesh
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సరిహద్దుగా ఉన్న ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం కె. కొండాపురం మాజీ సర్పంచ్ కొర్సా రమేశ్‌ని మావోయిస్టులు కిడ్నాప్‌ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టు ప్రభావిత భద్రాచలం ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మావోయిస్టుల నిర్మూళన కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆ క్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాలలో అవసరమైన చోట్ల ప్రత్యేక క్యాంపులు పెట్టి సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహాండ్స్, డీఆర్‌జీ బలగాలు మోహరించి నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా ప్రధాన రహదారులపై కాపుగాచి తనిఖీలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో పోలీసులు గ్రామాల్లో గస్తీ తిరుగుతున్నారు. ఓ విధంగా మావోయిస్టు ప్రభావిత మన్యం భద్రతా బలగాల నిఘా నీడలో కాలం వెళ్ళదీస్తోందని చెప్పక తప్పదు. అడవుల్లో గాలింపులు, గ్రామాల్లో తనిఖీలతో మావోయిస్టుల కార్యకలాపాలకు పోలీసులు చెక్ పెట్టడంతో ప్రశాంత వాతావరణం నెలకొందని అందరు భావిస్తున్న తరుణంలో నిశ్శబ్దంమాటున జరిగిన ఈ హత్య ఘటన వణుకుపుట్టిస్తోంది.

హై అలర్ట్..

రమేశ్ హత్యతో వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్మగూడెం మండలాల పోలీసులు అప్రమత్తమైనారు. రమేశ్ వెంకటాపురం మండలంలోని తన ఇంటివద్ద నుండి చర్లకు వస్తుండగా మార్గమధ్యలో మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొత్తపల్లికి తీసుకెళ్ళి హత్యచేశారు. పోలీస్ ఇన్‌పార్మర్‌గా పనిచేస్తూ మావోయిస్టు ఉద్యమానికి తీరని నష్టం చేస్తున్న కారణంగానే ప్రజాకోర్టు నిర్వహించి రమేశ్‌ని శిక్షించినట్లుగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిథులు, అధికారులు, వ్యాపారులను పోలీసులు అలర్ట్ చేశారు. అటవీ ప్రాంతాలలోకి వెళ్ళరాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాకపోకలు సాగించేవారిపై పోలీసులు నిఘా పెట్టారు.



Next Story

Most Viewed