మావోయిస్టు సానుభూతి పరుల అరెస్ట్

by  |
మావోయిస్టు సానుభూతి పరుల అరెస్ట్
X

దిశ‌, కొత్త‌గూడెం :
మావోయిస్టుల‌కు సానుభూతిప‌రులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు వ్యక్తులను అరెస్టు చేసిన‌ట్లు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ద‌త్ తెలిపారు. శనివారం నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు.ఎస్పీ కథనం ప్ర‌కారం.. మణుగూరు బుగ్గ క్రాస్ రోడ్డులో నిన్న పోలీసులు వాహన తనిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా అనుమానాస్పదంగా క‌నిపించిన ఇద్ద‌రిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, వారిద్దరూ మావోయిస్టు సానుభూతి ప‌రులుగా విచారణలో వెల్లడైంది. వీరిలో ఒక‌రు పదం వీరయ్య, మ‌రొక‌రు చీమల రవి అలియాస్ భీమా అని తేలినట్లు పోలీసులు తెలిపారు.

ప‌దం వీర‌య్య స్వ‌గ్రామం చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా. కొద్ది రోజుల కిందటే వీర‌య్య బుడుగుల‌కు వ‌చ్చి నివాసముంటూ వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి సానుభూతి ప‌రుడుగా ప‌నిచేసిన అనుభ‌వంతో ఇక్క‌డ కూడా మావోయిస్టు కార్యక‌లాపాల‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు పోలీసులు నిర్దారించారు. అలాగే పినపాక మండలం స్టేషన్ పరిధిలోని ఏడూళ్ల బ‌య్యారంకు చెందిన చీమల రవి (భీమా) కూడా మావోయిస్టు సానుభూతిపరులుగా పని చేస్తున్నారని చెప్పారు. మణుగూరు డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని మావోయిస్టులకు సహకరించే వ్యక్తులను, కమిటీ మెంబర్ లను గుర్తించామని ఎస్పీ వివరించారు. మావోయిస్టుల‌కు స‌హ‌క‌రిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్ దత్ హెచ్చరించారు.

Next Story

Most Viewed