హరిభూషణ్, సారక్క మృతిని నిర్ధారించిన మావోయిస్టు పార్టీ

by  |
Maoist-deaths
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ 21వ తేదీన, దండకారణ్యంలోని మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క అలియాస్ భరతక్క 22వ తేదీన ఇద్దరూ కరోనా లక్షణాలతో బాధపడుతూ చనిపోయారని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు వారి అంత్యక్రియలు ప్రజల మధ్యే చేశామని, 22వ తేదీ సంస్మరణ సభ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Maoists Haribhushan,-Sarakka

హరిభూషణ్ పార్టీలో కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నారని, 1991లో దళం చేరి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అంచలంచెలుగా ఎదిగి కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారని పేర్కొన్నారు. 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసినట్లు వివరించారు. అంతేకాదు గెరిల్లా జోన్ నిర్మాణ కృషిలో ప్రముఖ పాత్ర పోషించినట్లు చెప్పారు. ఏనాడూ మడమ తిప్పలేదని, ప్రతి మలుపులో డైనమిక్ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ విప్లవోద్యమం దెబ్బతిని నీరసించినప్పుడు, కార్యకర్తల వెన్నంటే ఉండి ధైర్యం చెప్పి మళ్లీ పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చారని ప్రకటనలో కొనియాడారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో జన్మించిన భరతక్క 1985లో ఏటూరు నాగారం మొట్టమొదటి దళంలో చేరి విప్లవ ప్రస్థానాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. 86లో అరెస్టై రెండేళ్లు జైలు జీవితం అనుభవించాక మళ్లీ దళంతో వచ్చినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి భరతక్క ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు వివరించారు. దండకారణ్యం నుంచి మాడ్ డివిజన్‌లోని ఇంద్రావతి ఏరియాలో జనతన సర్కార్‌కు సంబంధించి ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. వీరిని అంతమొందించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. చివరికి కరోనా బారిన పడి మృతువ్యాత పడడం ప్రకటనలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed