మావోయిస్టుల వ్యూహం.. పోలీసుల్లో కలవరం

by  |
మావోయిస్టుల వ్యూహం.. పోలీసుల్లో కలవరం
X

దిశ, భద్రాచలం : ఓవైపు నిఘా వ్యవస్థ పటిష్టపర్చుకొని, అధునాతన ఆయుధాలు సమకూర్చుకొని, పకడ్బందీగా ఇన్ఫార్మర్లతో మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు పోలీసులు సర్వసన్నద్ధమౌతుంటే, మరోవైపు సరికొత్త పంథాతో మావోయిస్టులు దాడులకు తెగబడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ప్రయోగించిన బాణం బాంబు పోలీసు యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.‌ జగదల్‌పూర్ – రాజమండ్రి జాతీయ రహదారిపై సుక్మా జిల్లా డోర్నపాల్ వద్ద లారీపై బాణం బాంబుతో మావోయిస్టులు అంబుష్‌ వేశారు. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ తప్పించుకొన్నారు. మావోయిస్టుల బాణం బాంబు దాడిలో గాయపడిన లారీ డ్రైవర్‌ని చికిత్స నిమిత్తం సుక్మా ఆస్పత్రికి తరలించారు. మునుపెన్నడు కనీవిని ఎరుగనట్టి మావోయిస్టుల బాణం బాంబు ప్రయోగానికి ఏజెన్సీవాసులు సైతం నివ్వెరపోయారు. ఈ ఘటనతో ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈజీగా బాణం బాంబు ప్రయోగించిన మావోయిస్టులు భవిష్యత్తులో అధునాతన సాంకేతిక మిసైల్స్‌తో అటాక్ చేసే ప్రమాదం లేకపోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాలానికి అనుగుణంగా అప్​డేట్​

కాలానికి అనుగుణంగా మావోయిస్టులు అప్‌డేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో భారీ నష్టం చవిచూస్తున్న మావోయిస్టులు పక్కా స్కెచ్ వేసి పోలీసులను మట్టుబెట్టడానికి అమర్చుతున్న ఐఈడీ మందుపాతరలు, బూబీట్రాప్స్ వంటి వాటిని అధునాతన టెక్నాలజీతో పోలీసులు ముందే పసిగట్టి వెలికి తీస్తున్నారు. దీంతో మావోయిస్టులు సైతం సరికొత్త పంథా అమలు చేస్తున్నట్లు సుక్మా జిల్లాలో వెలుగుచూసిన బాణం బాంబు ఘటన తేటతెల్లం చేస్తున్నది. ఇక్కడ మావోయిస్టులు తమ చేతిలోని పురాతన ఆయుధమైన బాణానికి బాంబు జతపర్చి కొత్త టెక్నిక్‌గా అంబుష్‌ ఉపయోగించారు. ఇది ఊహకందని విధంగా ఎవరికంట పడకుండా గెరిల్లా పద్ధతిలో మావోయిస్టులు తమ టార్గెట్ అమలుచేసే అత్యంత ప్రమాదకరమైన పంథాగా పోలీసులు భావిస్తున్నారు.‌ ఇక్కడ మావోయిస్డుల గురి తప్పిందా లేక మావోయిస్టులు తమ అమ్ములపొదిలోని సరికొత్త ఆయుధ పంథా గురించి బాహ్య ప్రపంచానికి (పోలీసులకు) తెలియపర్చడానికి ట్రయల్ వేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వెదురు బొంగులు, బీర్ సీసాలు, టిఫిన్ బాక్స్‌లతో బ్లాస్టింగ్స్‌కి మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇంతకు ముందే పోలీసులు పసిగట్టినట్టు సమాచారం.

ఆదివాసీ కూలీల మాటున రాష్ట్రానికి?

తెలంగాణలో మిర్చి కోతలకు ఛత్తీస్‌గఢ్ దండకారణ్య గ్రామాల నుంచి వేలాదిగా ఆదివాసీ కూలీలు తరలివస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలకు కూలీలమాటున మావోయిస్టులు వచ్చి భారీ కుట్రలకు పాల్పడే ప్రమాదం ఉందని భావించిన తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాహన తనిఖీలు, కార్డన్​ సెర్చ్ నిర్వహిస్తున్నారు. వలస వచ్చిన కూలీల ఆధార్ కార్డులు పరిశీలించడమే గాకుండా కూలీలను తీసుకొచ్చిన రైతులను బాధ్యులుగా చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న మావోయిస్టు ప్రభావిత మన్యంలో ఎటువైపు నుంచి ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో పోలీసులు కాలం వెల్లదీస్తున్నారు. నిత్యం గ్రామాల్లో గస్తీలు, వాహన తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు.


Next Story

Most Viewed