మంగపేటలో విషాదం.. గోదావరిలో మునిగి యువకుడు మృతి

by  |
young man dead
X

దిశ, మంగపేట: బంధువులతో కలిసి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు క్షణాల్లో వరదలో మునిగి గల్లంతై మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని మల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లూరు గ్రామానికి చెందిన మంచర్ల శ్రీను-లక్ష్మీ దంపతుల కొడుకు రాజేష్(17) వెంకటాపురం మండల కేంద్రంలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. మూడ్రోజుల క్రితం తమ బంధువు చీమల అర్జున కొడుకు వివాహానికి వెళ్లి ఆదివారం మేనమామ గోళి రాజారాం, మేనత్త, వారి ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. ఒడ్డు వెంట లోతు తక్కువగా ఉండడంతో మేనమామతో కలిసి గోదావరి మధ్యలోతులోకి వెళ్లారు. ఇంతలో వరద ఉధృతి పెరిగి, క్షణాల్లో రాజేష్ గోదావరిలో మునిగి గల్లంతయ్యారు.

దీంతో ఆందోళన చెందిన మేనమామ రాజారాం నీటిలో ముగిని ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో రాజారాం రోధిస్తూ బయటకొచ్చాడు. ఇంటికొచ్చిన అనంతరం విషయాన్ని రాజేష్ తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ హుటాహుటిన గోదావరి నది వద్దకు వచ్చి రాజేష్ కోసం నాటుపడవలతో గాలించడం ప్రారంభించారు. దాదాపు రెండు గంటల అనంతరం రాజేష్ విగతజీవిగా దొరికాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లితండ్రులు శ్రీనివాస్-లక్ష్మీలతో పాటు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు, బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేష్ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.

Next Story