Breaking: మంగళవారిపేట సర్పంచ్, ఉప సర్పంచ్‌పై వేటు

by  |
Collector Gopi
X

దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మంగళవారిపేట సర్పంచ్ గుగులోతు రమేష్ నాయక్, ఉప సర్పంచ్ డబ్బేట ఉపేందర్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులను సర్పంచ్, ఉప సర్పంచ్ కాజేశారనే ఆరోపణల నేపథ్యంలో వేటు పడినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో కొందరు గ్రామస్తులు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తులో సంబంధిత నిధుల వివరాలను కావాలని కోరారు. దీనితో పాటుగా జిల్లా పంచాయతీ శాఖ అధికారి, జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో నిధుల అవినీతి జరిగినట్టుగా నిరూపణ కావడంతో బాధ్యులైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ కార్యాలయం ద్వారా ఉత్తర్వులు మండల పరిషత్ కార్యాలయానికి మెయిల్ ద్వారా శుక్రవారం సాయంత్రం పంపినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ఇదే విషయంలో ఇక్కడే గతంలో పనిచేసిన పంచాయితీ కార్యదర్శి సైతం అవినీతికి పాల్పడినట్లు తేలగా.. అతనిపై చర్యలు తీసుకొని సర్పంచ్‌ను వదిలేశారనే ఆరోపణలు సైతం వచ్చాయి. కానీ, తాజాగా కలెక్టర్ గోపి తీసుకున్న నిర్ణయంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచుల్లో వణుకు మొదలైంది అనే చర్చ మండల వ్యాప్తంగా నడుస్తోంది.


Next Story

Most Viewed