కత్తి మహేశ్ మృతిపై మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు

by  |
Kathi Mahesh Manda Krishna
X

దిశ, ఏపీ బ్యూరో : సినీ నటుడు, సినీ క్రిటిక్‌ కత్తి మహేశ్‌ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కత్తి మహేశ్‌‌కు జరిగిన ప్రమాదం తీరు చూస్తుంటే అనుమానంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్‌ కారు కుడి భాగం నుజ్జునుజ్జు అయితే డ్రైవర్‌ సురేశ్‌ స్వల్ప గాయాలతో బయటపడటం.. ఎడమ వైపు కూర్చుకు మహేశకు తీవ్ర గాయలవడంపై అనుమానంగా ఉందన్నారు.

కత్తి మహేశ్‌కు ఎంతో మంది శత్రువులు ఉన్నారన్నారని, గతంలోని దాడులు, కొన్ని సంఘటనలే అందుకు నిదర్శనమన్నారు. కత్తి మహేశ్ మరణంపై విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు బుధవారం నెల్లూరు జిల్లా రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డిని కలిశారు. కత్తి మహేశ్‌ మృతిపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీంతో సీఐ రామకృష్ణా రెడ్డి డ్రైవర్‌ సురేశ్‌ను విచారణకు పిలిచి దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు డీఎస్పీ హరినాథ్‌రెడ్డి విచారణలో భాగంగా విచారణ నిమిత్తం కోవూరు పీఎస్‌కు వెళ్లారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

చనిపోయాడని మాకు చెప్పలేదు : కత్తి మహేశ్ తండ్రి ఓబులేసు

కత్తి మహేష్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేసు అన్నారు. మహేశ్‌ మృతి విషయం ఆసుపత్రిలో ఉన్న తమకు చెప్పకుండా వైద్యులు నేరుగా మీడియా ముఖంగా చనిపోయాడని ప్రకటించడంపై అనుమానాలున్నాయని చెప్పారు. దీనిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదని.. ఇప్పుడు న్యాయం కోసం పోరాడే పరిస్థితిలో తాము లేమన్నారు.

Next Story