అత్తింటివారి వేధింపులు.. ఫేస్ బుక్ లైవ్ పెట్టి భర్త ఏం చేశాడంటే..?

by  |
అత్తింటివారి వేధింపులు.. ఫేస్ బుక్ లైవ్ పెట్టి భర్త ఏం చేశాడంటే..?
X

దిశ, ఏపీ బ్యూరో: కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సంసారంలో నెలకొన్న గొడవలను సర్ధిచెప్పాల్సిన అత్త గొడవకు మరింత ఆజ్యం పోసింది. ఇంట్లో జరుగుతున్న గొడవను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. తన భర్త వేధిస్తున్నాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో కొన్నిరోజులుపాటు వారి కాపురం సజావుగా సాగింది. తర్వాత మళ్లీ గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య, అత్త, మరదలి వేధింపులే కారణమని ఆరోపించాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సునీతకి గుంటూరు జిల్లాకు చెందిన ఉదయ్ భాస్కర్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మేనేజర్‌గా పని చేస్తూ మదనపల్లిలోని శేషమహల్ ఏరియాలో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఉదయ్‌ భాస్కర్ సునీతల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవలే సునీత భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిన తరువాత ఇంటికి చేరుకున్న ఉదయ భాస్కర్ ఫేస్‌బుక్ లైవ్‌ఆన్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆరోపించాడు. ఈ విషయం గమనించిన అతని స్నేహితులు ఉదయ భాస్కర్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అప్రమత్తమయ్యే లోపే ఉదయ భాస్కర్ ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉదయ భాస్కర్ మద్యానికి బానిసై తరచూ వేధింపులకు గురి చేసేవాడని, రెండు రోజుల క్రితం కూడా తనను కొట్టడంతోనే పుట్టింటికి వెళ్లానని సునీత పోలీసులకు తెలిపింది. గతంలోనూ భర్త ఉదయ్ భాస్కర్ వేధింపులపై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశానని స్పష్టం చేసింది. మరోవైపు ఉదయ్ భాస్కర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కొడుకు మృతికి భార్య సునీత, ఆమె తల్లి, మరదలే కారణమని వారు ఆరోపిస్తున్నారు.


Next Story

Most Viewed