కేసు నుంచి విముక్తి కల్పిస్తానని రూ.3.60కోట్లు వసూలు

by  |
కేసు నుంచి విముక్తి కల్పిస్తానని రూ.3.60కోట్లు వసూలు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: అనుమతి లేకుండా అమ్మోనియం దిగుమతి చేసిన పేలుడు పదార్థాల వ్యాపారిని కేసు నుంచి బయట పడేస్తానని నమ్మబలికి రూ.3.60కోట్లకు టోకరా పెట్టిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్, రాజ్‌కుమార్‌లు కూ లైసైన్స్ కలిగిన పేలుడు పదార్థాల వ్యాపారం నిర్వహిస్తుంటారు. 2019లో 10టన్నుల అమ్మోనియంను అనుమతి లేకుండా రవాణా చేస్తుండగా.. ఆర్జీఐ పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇదేక్రమంలో వీరికి మహారాష్ట్ర పుణెకు చెందిన కపిల్ రాజేంద్రకుమార్ (పేలుడు పదార్థాల వ్యాపారి) పరిచయం కావడంతో బయటకు తీసుకొస్తానని అందుకు రూ.కోటి ఖర్చవుతోందంటూ చెప్పాడు.

ఈ సమయంలో రూ.60లక్షలను కపిల్ రాజేంద్రకుమార్‌కు హవాలా ఏజెంట్ ద్వారా అందించగా ఆ తర్వాత సీనియర్ పోలీస్ అధికారులకు ఇవ్వాలంటూ మరో రూ.2కోట్లు డిమాండ్ చేశాడు. దీంతో విజయ్‌కుమార్ ఒకసారి రూ.1.50 కోట్లను ఏర్పాటు చేశాడు. అయినా.. రాజ్ కుమార్‌ను బయటకు తీసుకురాలేదు. అనంతరం మరో రూ.35 లక్షలు, తర్వాత రూ.60 లక్షలను ఇలా వేర్వేరు సందర్భాల్లో మొత్తం రూ.3.60 కోట్లను వసూలు చేశాడు. కానీ, రాజ్‌కుమార్‌ను కేసు నుంచి బయట పడేయలేకపోయాడు. ఈ విషయంపై బాధితుడు విజయ్ కుమార్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడు కపిల్ రాజేంద్రకుమార్‌ను సీసీఎస్ పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ ఎన్.మహేందర్ తెలిపారు.



Next Story

Most Viewed