మల్లారెడ్డిపై విచారణకు మల్లు రవి డిమాండ్

by  |
Mallu Ravi
X

దిశ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులను అణచివేస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మల్లు రవి మాట్లాడారు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు లాభం జరగాలనే కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అందుకే రేవంత్ రెడ్డి సోనియాను తెలంగాణ తల్లిగా భావిస్తారని అన్నారు. అర్హులైన దళిత, గిరిజన అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టులు కేటాయించారని, అగ్రవర్ణాల అధికారులు పదవీ విరమణ పొందాక కూడా తిరిగి విధుల్లో కొనసాగిస్తుండటంపై ఆయన మండిపడ్డారు.

బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు నిధులు కేటాయించి ఖర్చుచేయలేదని, దళిత గిరిజన వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఆత్మగౌరవ దండోరా నిర్వహించామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వస్తున్నారని, మూడుచింతలపల్లిలో దళితుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలోనూ దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు.

కేసీఆర్‌ దత్తత గ్రామంలో నెలకొన్న సమస్యలపై రేవంత్‌రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. బాధ్యతగల మంత్రి స్థానంలో ఉండి రేవంత్ పై ఇష్టానుసారంగా మాట్లాడి తన విలువను కోల్పోయారన్నారు. మల్లారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించాలి. ఈటల రాజేందర్‌పై విచారణ జరిపినట్లు మల్లారెడ్డిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్టునే ఎమ్మెల్యేలు, మంత్రులు చదువుతున్నారున్నారు.

Next Story