ఆహ్లాదానికి నిలయం మల్లన్నగట్టు

by  |
ఆహ్లాదానికి నిలయం మల్లన్నగట్టు
X

దిశ నాగార్జునసాగర్: అహ్లాదకరమైన ప్రకృతి అందాలకు మల్లన్న గట్టు నిలయంగా ఉంటుంది. మల్లన్న గట్టు దేవరకొండ తాలూకా పెద్ద చర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామపంచాయతీలో దట్టమైన అడవి ప్రాంతంలో కొలువుదీరిన మల్లన్న దేవాలయం నూతన గృహంలో కొలువైన సాక్షాత్తు ఈశ్వరుడు మల్లన్న గట్టు గా పేరు. ప్రత్యేకత కలిగిన దేవస్థానం నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ కృష్ణమ్మ. 365 రోజులు కొండ ధరిలోంచి ఉబికి వచ్చి శివయ్యను అభిషేకించే గంగమ్మ. ఓ సొరంగ మార్గం నుంచి మనం లోనికి వెళితే, అర్ధచంద్రాకారంలా ముంముదుకు పొడుచుకు వచ్చిన గట్టుధరి, అంతే విస్తిర్ణంలో అర్ధ చంద్రాకారంలా అరుగు వేసినట్లు కింది ధరి. ఆ ధరి మీదే కొలువై ఉన్న శివయ్య. ఎటుచూసిన పచ్చని ప్రకృతి.

గట్టుదరిలోంచి జలజలాకారే నీటితో ఎల్లపుడు చల్లదనం, ఎటు చూసినా ఆహ్లాదరమైన వాతావరణం.. ఇక తనువులో సగం పార్వతమ్మ, నెత్తిలో గంగమ్మ, కొప్పున చంద్రవంకతో, అడిగిందే తడువుగా భక్తుల కోర్కెలు తీర్చే భోళాశంకురుడు కొలవైనదే దేవరశల. అంతే కాదు పరమేశ్వరుని ఇష్టమైన వన్నీ ఇక్కడ ప్రకృతి సిద్దంగా ఉండడం ఈ క్షేత్ర మహిమకు తార్కాణం. ఎందుకంటే ఎదురుగా కృష్ణమ్మ, అర్దచంద్రాకారంలో వంపు తిరిగిన గట్టు. ఇక శివుని నెత్తిన 365 రోజులు పడే గంగమ్మే కాదు, పున్నమి వెన్నెల రాత్రి ఇక్కడ బసచేస్తే చంద్ర కిరాణాలు సైతం శివయ్యను అభిషేకిస్తాయి.

యురేమియం తవ్వకాలకోసం కేంద్రం ప్రభుత్వం ప్రస్తుతం పెద్దగట్టుకు రెండు దశాబ్దాల క్రితం రోడ్డు మార్గం నిర్మించింది. లేదంటే ఇక్కడకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలోంచి కాలినడకే శరణ్యం. మనం ఏ శైవక్షేత్రంలో చూసినా శివలింగం మీద కళశంలో ఉంటుంది. అందులోంచి నీటిబిందువులు శివయ్యను అభిషేకిస్తుంటాయి. కాని దేవరశలలో మాత్రం సహజసిద్దంగానే గంగమ్మ శివుని శిరస్సుపై పడుతుంది. అంతేకాదు ఇక్కడ ఆలయం ఉండదు. పెద్ద బల్లపరువు బండమీదే శివుడు కొలువై ఉంటాడు. ఆయనకు కుడిపక్క ఓ సొరంగం ఉంటుంది. అందులోంచి ప్రయాణిస్తే ప్రస్తుతం నాగార్జున్‌ సాగర్‌ ప్రాజెక్టు నీటిలో మునిగిపోయిన పురాణ ప్రాశస్త్యం ఉన్న ఏలేశ్వరం, అక్కడి నుంచి శ్రీశైలం చేరుకోవచ్చని స్థానికులు చెబుతారు.

దేవరుషుల తపోనిలయం

స్థానికుల కథనం ప్రకారం ఇక్కడ శివుడుని దేవరుషులు ప్రతిష్టించారని చెబుతారు. దేవరుషులు తపస్సు చేసుకునే ప్రాతం కాబట్టే ఇది దేవరుషుల మూలంగానే దీనికి దేవరశల అనే పేరు వచ్చిందంటారు. దేవరుషులు ఇక్కడి నుంచి వేకువ జాముననే బయలు దేరి, ఏళేశ్వరం, శ్రీశైలం క్షేత్రాలకు వెళ్లి, దైవ దర్శనం చేసుకొనేవారని అంటారు. కాకపోతే స్థానికులు చెప్పే కథనం ప్రకారం ఇక్కడ ఓ సొరంగం కూడా ఉంది. అయితే ఈ శల పైకి కనిపించదు. గట్టుమీద ఓ పెద్ద సొంరంగం ఉంటుంది.అందులోంచి కొంతదూరం నడిచి వెళితే శివుడు కొలువైన ప్రదేశం చేరుకోవచ్చు.గతంలో ఈ సొరంగంలోంచి నడిచి చేరుకోవడం కష్టతరంగా ఉండేది. కాని పెద్దగట్టుకు చెంది ఓ భక్తుడు ఇక్కడ మెట్లు నిర్మించడంతో స్వామిని చేరుకోవడం తేలికైంది.

365 రోజులు జాలువారే గంగమ్మ

ఇక్కడ కొలువైన స్వామి మల్లన్నగా భక్తుల పూజలు అందుకుంటన్నారు. ప్రస్తుతం పూజలు అందుకుంటున్న ప్రాంతానికి మరో పావు కిలోమీటరు ధరిమీంచి ప్రయాణం చేసి వెళితే అక్కడ ముసలి మల్లయ్య కొలువై ఉన్నాడు. పూర్వం నాగార్జున సాగర్‌ నిర్మాణం జరగక ముందు.. ఆ ముసలి మల్లయ్య స్వామి దగ్గరకు కొండ కింది నుంచి పైకి కాలినడకన చేరుకునే వారు. కాని ఇప్పుడు సాగర్‌ డ్యాం నిర్మాణం తర్వాత బ్యాక్‌ వాటర్‌ రావడంతో అటువైపు బాట సరిగ్గాలేదు. ఇక ఇప్పుడు ఈ సొరంగ మార్గం లోంచే వెళ్లాల్సి ఉంటుంది. కాని ఎల్లవేళలగా ధరిలోంచి జాలువారే నీటితో నడక మార్గం అంతా చిత్తడిగా ఉంటుంది. కాలు జారితే లోయలోకి పడే ప్రమాదం ఉంది. అందుకే ముసలి మల్లయ్య దర్శనం అందని భాగ్యంగా మారింది.

ఆదుకో మల్లయ్యా..

ఇక్కడికి చేరుకోవడం ఎంత కష్టమైనా చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ సొరంగ మార్గంలోకి అడుగు పెట్టగానే ఆదుకో మల్లయ్యా, చేరదీసుకో మల్లయ్య అని స్వామిని పిలుస్తూ భక్తులు ముందుకు సాగుతారు. భక్తులు పిలువులు విన్నకొద్ది శివయ్య నెత్తిన ఉన్న గంగమ్మ పరవశించిపోతుందేమో.. కొండ ధరిలోంచి జాలువారే నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇక ఇక్కడకు చేరుకున్న భక్తులు ఆ ధరిలోంచి జాలువారే నీటితో నే స్నానాలు చేసి, స్వామిని దర్శనం చేసుకుంటారు. స్వామికి ప్రసాదాలు వండి పెడతారు.అన్నింటికి అదే నీరు. మండు వేసవిలో సైతం ఇక్కడ ధరుల్లోంచి నీరు వస్తుంది. ఈ ప్రాంతంలో ఎక్కడ చుక్కనీరు లేకున్నా ,ఈశలలో మాత్రం నీరు దొరుకుతుంది.ఇది స్వామి మహిమేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ శివరాత్రికి జాతర సాగేది. ప్రస్తుతం జరగడం లేదు. కాని ప్రతి శివరాత్రికి, తొలి ఏకాదశి రోజు మాత్రం వందల సంఖ్యలో భక్తలు శివున్ని దర్శించుకుంటారు. ఇక యల్లాపురం, పెద్దగట్టు, ఊట్లపల్లి, చుట్టపక్కల తండాల వారికి మాత్రం దేవరశల మల్లన్న కోరికలు తీర్చే భోళాశంకురుడు. వారికి ఏ కష్టం వచ్చిన, సంతానం లేకున్నా , స్వామిని దర్శించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో మల్లయ్య, శలమల్లయ్య,మల్లమ్మ అనే పేర్లు ఎక్కువగా వినిపించడం గమనార్హం.

దేవాదాయ శాఖ దృష్టిసారించాలి.

ప్రత్వ దేవాదాయ శాఖ వారు ఈ క్షేత్రం పై దృష్టి సారించాలని, అభివృద్ది చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. కృష్ణ పుష్కరాలు వచ్చినప్పుడు ఊట్లపల్లి సమీపంలో ఘాట్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎలాంటి ఆలయం లేదు,. ఘాట్లకు 8 కిలోమీటర్ల దూరంలోనే దేవరశల ఉంది. యురేనియం తవ్వకాల కోసం రోడ్డు నిర్మించారు. కాబట్టి ప్రభుత్వం శ్రద్ద తీసుకుని దీనిని అభివృద్ది చేస్తే, పుష్కరాల సందర్భంగా భక్తులు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకునే అవకాశం కల్గుతుందని స్థానికులు అంటున్నారు. నిజమే సహజసిద్దమైన గుహాలయాంలో కొలువైన శివున్ని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఇప్పటికి రుషులు తపస్సు చేసుకుంటారని అంటారు.రాత్రంతా తపస్సు చేసి ఉదయం పక్కనే ఉన్న గుహలోకి వెళతారని, శివలింగం పక్కన ఉన్న సొరంగ వద్ద కాస్త లోనికి వెల్లి వింటే ఇప్పటి ఓం నమశివాయ అనే శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అభివృద్ధిపై మన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Next Story

Most Viewed