హాట్ టాపిక్‌గా మల్కాజ్‌గిరి.. నేతల తీరుతో తీవ్ర ఉద్రిక్తత.?

by  |
హాట్ టాపిక్‌గా మల్కాజ్‌గిరి.. నేతల తీరుతో తీవ్ర ఉద్రిక్తత.?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇవ్వాలని నిరసనలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మూడు చింతల పల్లిలో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ దీక్షలో మొదటి రోజు కేవలం దళిత గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై, ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని రేవంత్ ప్రసంగించారు.

రెండో రోజూ ప్రభుత్వంపై పలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యం ఏలుతున్నారని రేవంత్ విమర్శించారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, 3 ఎకరాలు ఇస్తానని, ముగ్గురి దళిత నేతలను డిప్యూటీ సీఎం పేరుతో మోసం చేశావని కేసీఆర్ తీరుపై రేవంత్ మండిపడ్డారు.

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, మేడ్చల్‌ల్లో మల్లారెడ్డి కుటుంబం దోచుకుంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. దీంతో మల్లారెడ్డి తీవ్ర పదజాలంతో రేవంత్‌పై రెచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరువురు నేతలు బహిరంగ విమర్శలు హాట్ హాట్ టాపిక్‌గా మారి దళిత బంధు పక్కదారి పట్టించేలా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ముదురుతున్న వైరుధ్యంతో ఎదురు దాడులు చేసుకునే ప్రమాదం పొంచివుంది.

కేంద్ర బిందువుగా మారిన మల్కాజ్‌గిరి నియోజకవర్గం..

రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, వ్యక్తిగత దాడులకు పాల్పడుతుండడం, బూతు పురాణాలతో రచ్చకెక్కడం మేడ్చల్ జిల్లా కేంద్ర బిందువుగా మారింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంత్ రావు, మంత్రి మల్లారెడ్డిల మధ్య తీవ్ర దుమారం రేపింది.

గత కొన్ని రోజుల క్రితం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే హనుమంత్ రావు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల మధ్య జరిగిన సంభాషణ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసి దాడులు, కేసుల దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే రేవంత్‌పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్లారెడ్డి ఇంటిపై దాడులకు పాల్పడిన సంఘటనతో మేడ్చల్ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

నేతల తీరుపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు బరితెగించి బూతు పురాణాలు చేసుకోవడం వల్ల కింద స్థాయి నేతల్లో దాడులను ప్రోతహించే ప్రమాదం నెలకొంది. ఇలాంటి సంస్కృతి సమాజానికి మంచిది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed