మాల్దీవుల్లో పర్యటిస్తే.. ట్రావెల్ పాయింట్లు

by  |
మాల్దీవుల్లో పర్యటిస్తే.. ట్రావెల్ పాయింట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ప్రయాణాలు చేయడానికే ప్రజలు భయపడుతుంటే.. ఇక పర్యాటక ప్రాంతాలకు ఎలా పోతారు. అందుకే.. ఆయా దేశాలు, రాష్ట్రాలు తమ పర్యాటక రంగానికి తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మాల్దీవులు ఓ వినూత్న ఆలోచనతో పర్యాటకులను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. మాల్దీవులను సందర్శించే పర్యాటకులకు ట్రావెల్ పాయింట్లు ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

పర్యాటకులకు భూతల స్వర్గంగా పేరొందిన మాల్దీవుల్లో లాక్‌డౌన్ కారణంగా పర్యాటక రంగం కుదేలయ్యింది. ప్రతి సీజన్‌లో లక్షలాది మంది పర్యాటకులతో కళకళలాడే మాల్దీవులు ప్రస్తుతం జనం లేక వెలవెలపోయింది. వాస్తవానికి మాల్దీవులకు పర్యాటక రంగమే ప్రధాన ఆర్థిక వనరు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా వెనకబడటంతో.. కరోనా సమయంలోనూ అన్నింటికంటే ముందే పర్యాటక రంగాన్ని తిరిగి ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ‘మాల్దీవ్స్ బార్డర్ మైల్స్’ పేరుతో ఇటీవలే ఓ వినూత్న లాయల్టీ ప్రోగ్రామ్‌ను సందర్శకులకు ఆఫర్ చేస్తోంది.

ఆభరణ(గోల్డ్), అంతర(సిల్వర్), ఐదా(బ్రాంజ్).. ఇలా మూడు కేటగిరీల్లో ట్రావెల్ పాయింట్లను విభజించారు. మాల్దీవుల్లో నెంబర్ ఆఫ్ విజిట్స్, డ్యూరేషన్ ఆఫ్ స్టే ఆధారంగా వారికి ట్రావెల్ పాయింట్లు లభించనున్నాయి. ఇక స్పెషల్ అకేషన్స్‌ను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తే.. అడిషనల్ పాయింట్స్ వస్తాయి. పర్యాటకులు మరోసారి మాల్దీవులకు వచ్చినప్పుడు అక్కడి హోటల్స్, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో ఈ ట్రావెల్ పాయింట్ల ఆధారంగా రాయితీలను పొందవచ్చు. అయితే ఈ కొత్త పథకం డిసెంబర్ నుంచి మొదలు కానుంది. ట్రావెల్ పాయింట్లు పొందాలనుకునే కస్టమర్లు ముందుగానే ‘మాల్దీవ్స్ బార్డర్ మైల్స్‌’లో తమ వివరాలు రిజస్టర్ చేసుకోవాలి.

Next Story