కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా తీవ్రత

by  |
కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా తీవ్రత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 613 మలేరియా కేసులు తేలగా.. ఈ రెండు జిల్లాల నుంచి ఏకంగా 50 శాతం మంది బాధితులున్నారు. అటవీ ప్రాంతం కావడం, వ్యాధులపై అవగాహన లేకపోవడం , ఆ దిశగా అధికారులు కల్పించలేకపోవడంతో తీవ్రత పెరిగింది. అంతేగాక ముందస్తు నివారణ చర్యలేవీ తీసుకోకపోవడంతో ఆ రెండు జిల్లాల్లో మలేరియా వ్యాధి విజృంభిస్తున్నది. దీంతో ఆ జిల్లాల్లో నోడల్ ఆఫీసర్లను నియమించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది.

వీరి ఆద్వర్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి మలేరియా, డెంగీ వ్యాధుల స్క్రీనింగ్ చేయనున్నారు. ఒక ఇంట్లో ఎవరికైనా మలేరియా, డెంగీ పాజిటివ్ లు ఉంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ లక్షణాలు లేకున్నా టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత ఆసీఫాబాద్, భూపాలపల్లి, హైదరాబాద్, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో మలేరియా ప్రభావం స్వల్పంగా ఉన్నది. మిగతా జిల్లాల్లో మలేరియా వ్యాధి పూర్తిగా లేనట్టు ఆరోగ్యశాఖ గుర్తించింది. అయితే రాబోయే రేండేళ్ల వరకు తెలంగాణను మలేరియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక డెంగీ వ్యాధి అర్బన్, సెమీ అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా ఉన్నది. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట్, నిజామాబాద్, నిర్మల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్ లలో మాత్రమే ఉన్నట్టు హెల్త్ ఆఫీసర్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed