రావణ దహనాన్ని నిషేధించాలి.. అసలు రాక్షాసుడు ఆయన కాదు

by  |
Malabari leaders
X

దిశ, కాటారం: ఆర్యుల కుట్రలతో బలైన రావణాసుర, నరకాసుర, మహిషాసురులను రాక్షసులుగా చిత్రీకరించి నేటికీ దేశవ్యాప్తంగా వారి దహన కార్యక్రమాలు చేపట్టడం హింసను మరింత ప్రేరేపించడమేనని మాలభేరి రాష్ట్ర కోఆర్డినేటర్ కిరణ్, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, యూవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాపు, విశ్వబ్రాహ్మణ జిల్లా నాయకుడు గణపతి ఆరోపించారు. గురువారం కాటారం మండల కేంద్రంలో రావణుడి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరప్ దేశాల నుండి వలసొచ్చిన ఆర్యులు, స్థానిక రాజులపై దాడులు జరిపి, వారిని ఓడించి భూభాగాన్ని ఆక్రమించుకున్నారన్నారు.

వారు రాక్షసులు కాబట్టే యుద్ధంలో ఓడిపోయారని, అందుకే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే రావణాసురుడు, నరకాసురుడు, మహిషాసురుడు, శిబి చక్రవర్తి లాంటి రాజులను చంపి నేడు దేశంలో పండుగలు చేసుకునే హింసాత్మక సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని, అలాంటి వేడుకల్లో ప్రజల భాగస్వామ్యం కాకూడదని సూచించారు. విజయదశమి వేడుకల పేరుతో వారి చిత్రపటాలను బాంబులతో పేల్చి వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed