మాస్కుల తయారీలో మహిళలే మహారాణులు

by  |
మాస్కుల తయారీలో మహిళలే మహారాణులు
X

దిశ, రంగారెడ్డి: ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ మాస్కులను ధరిస్తుండటంతో కొరత ఏర్పడి ఎక్కువ ధరలకు విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మాస్కుల కొరత రంగారెడ్డి జిల్లా స్వయం సహాయక మహిళలకు ఆదాయ మార్గంగా మారింది. రోజుకు వందల సంఖ్యలో మాస్కులను తయారు చేస్తూ సరికొత్త రికార్డును సృష్టిస్తున్నారు.

ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో శంకర్‌పల్లి మండల స్వయం సహాయక మహిళలకు మాస్కుల తయారీ మంచి ఆదాయ వనరుగానే కాకుండా, సామాజిక సేవగానూ మారిందని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మార్కెట్లో ఒక్కో మాస్క్ కనీసం రూ.40 నుండి 100వరకు ఉందని, అయితే మన స్వయం సహాయక మహిళలు తయారు చేసే మాస్క్ కేవలం రూ.15కే విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. శంకరపల్లి‌లోనే రోజుకు 500లకు పైగా మాస్కుల తయారీ జరుగుతోందని, ప్రస్తుతం మాస్కులకు డిమాండ్ బాగా ఉందని తెలిపారు.

కాగా మాస్కుల తయారీకి ఉపయోగించే క్లాత్ నిన్నటివరకు మార్కెట్‌లో కిలోకు రూ. 150 నుండి 200 వరకు లభ్యం కాగా, నేడు అది రూ. 400కు పెరిగిందని, లాక్‌డౌన్ వల్ల బయటి రాష్ట్రాల నుండి క్లాత్ రాకపోవడమేనని పీడీ చెప్పారు.

Tags: Corona Virus Effect, Mask Shortage, Helping Women, Rangareddy, DRDO Project Director, Shankarpally

Next Story