‘సామాజిక దూరంతోనే కరోనా నియంత్రణ’

by  |
‘సామాజిక దూరంతోనే కరోనా నియంత్రణ’
X

దిశ, మహబూబ్ నగర్: సామాజిక దూరంతోనే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చుననీ, కావున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనను పాటించి, కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం మద్దూరు, కోస్గి కర్ణాటక సరిహద్దు రావులపల్లి చెక్ పోస్ట్ లను శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆయన పోలీసులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, శానిటేషన్, మీడియా సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని సూచించారు. ఇప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గంలో కరోనా వైరస్ ఆనవాళ్లు లేకపోవడం కాస్తంత ఊరటనిచ్చే విషయమన్నారు. ఈ వ్యాధి నివారణకు నిరంతరం పోరాటం చేస్తున్న వైద్య, పోలీసు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు, రెవెన్యూ, మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు తప్పక పాటించి అప్రమత్తంగా ఉండాలనీ, ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని పేర్కొన్నారు. వలస కూలీలు, రేషన్ కార్డు లేనివారిని గుర్తించి బియ్యం, నగదు అందించేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. మండలంలో 12 కిలోల బియ్యం, రూ.1500 అందరికీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

tags: MLA narender reddy, kodangal, mahabubnagar, coronavirus, maddur, mask distribution,

Next Story

Most Viewed