జనవరి నుంచి కార్ల ధరల పెంపు : మహీంద్రా!

by  |
జనవరి నుంచి కార్ల ధరల పెంపు : మహీంద్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021లో వాహన ధరలను పెంచనున్నట్టు దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మంగళవారం వెల్లడించింది. 2020 ఏడాది ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ధరల పెంపును కార్ల తయారీదారులు ప్రకటిస్తున్నారు. ముందుగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ధరల పెంపు నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదే బాటలో కొరియా సంస్థ కియా వచ్చే నెల నుంచి భారత్‌లో తన కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. వీటి బాటలోనే మహీంద్రా కూడా దేశీయంగా అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని భావిస్తోంది.

ఈ ధరల పెరుగుదల ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలన్నిటికీ వర్తిస్తుందని, జనవరి 1 నుంచి ధరలు అమల్లోకి రానున్నట్టు మహీంద్రా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వేర్వేరు మోడళ్లలో ధరల పెరుగుదలకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియ జేయనున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం..వస్తువుల ధరలు పెరగడం, ఇన్‌పుట్ ఖర్చులు అధిక మవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ధరల పెరుగుదలను నిర్ణయించినట్టు పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కార్ల తయారీదారులకు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆటో మొబైల్ తయారీదారులు తమ వాహనాల ధరలను గతేడాదే పెంచాలని నిర్ణయించాయి కానీ పరిస్థితుల కారణంగా అమలు చేయలేదు. ప్రస్తుత పరిస్థితులో పెంచక తప్పటంలేదని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.



Next Story

Most Viewed