ఆగని కరోనా కేసులు

by  |
ఆగని కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో:
రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1329 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కానీ ఆ తర్వాత రాష్ట్రాలు విడుదల చేసిన తాజా బులెటిన్లలోని లెక్కలు ఈ జాబితాలోకి చేరలేదు. వాటిని కూడా కలుపుకుంటే దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19693కు చేరుకుంది. మహారాష్ట్రలో రాత్రి 9 గంటలలోగా 549, రాజస్థాన్‌లో 159 కేసులు నమోదు కావడంతో ఒక్క రోజు వ్యవధిలో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1329కి బదులుగా 2037 అయింది. ఒకే రోజున ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కేంద్ర లెక్కల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 4669. కానీ ఆ రాష్ట్ర బులెటిన్ ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 5218. ఇలాంటి తేడాలు చాలా ఉన్నాయి.

ఐదువేల మార్కు దాటిన ఏకైక రాష్ట్రం మహారాష్ట్ర..

మహారాష్ట్రలో ఒకే రోజున 552 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ముంబయి నగరంలోనే 419 కేసులు వెలుగుచూశాయి. ఇక దేశవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 603. గడచిన 24 గంటల్లో 44 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 19 మంది మహారాష్ట్రలోనే ఉన్నారు. ఇక గుజరాత్‌లో 112, తమిళనాడులో 76, ఢిల్లీలో 75, తెలంగాణలో 56, ఆంద్రప్రదేశ్‌లో 35 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. రాపిడ్ టెస్టులు జరపడం ద్వారా పాజిటివ్ కేసుల్ని గుర్తించవచ్చంటూ రాష్ట్రాలు స్వంతంగా కిట్లను సమకూర్చుకున్నా.. ఐసీఎంఆర్ దానికి అడ్డుకట్ట వేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లు నాసిరకంగా ఉన్నాయని, కేవలం ఐదు శాతం మాత్రమే ప్రామాణికత కలిగి ఉన్నాయంటూ రాజస్థాన్ ప్రభుత్వం చెప్పడంతో ఐసీఎంఆర్ రెండు రోజుల వరకూ ఈ కిట్లతో పరీక్షలు చేయవద్దని, వెంటనే వాపసు ఇవ్వాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటూ ఆందోళన పడుతున్న రాష్ట్రాలు రాపిడ్ టెస్టులపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. కానీ వాటి నాణ్యతపై విమర్శలు రావడంతో ఆ ప్రయత్నాలకు ఐసీఎంఆర్ బ్రేకులు వేసింది. పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే పాజిటివ్ పేషెంట్లను గుర్తించవచ్చంటూ రాష్ట్రాలు అభిప్రాయపడుతుండగా, ఎటువంటి లక్షణాలు లేకుండానే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రెండువేల మార్కు దాటుతూ ఉంది. కాగా, కొత్త కేసులు వేగంగా పుట్టుకొస్తున్ననేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం నిర్వహించనున్న మంత్రివర్గం సమావేశంలో కరోనా వ్యాప్తిపైన విస్తృతమైన చర్చ జరగనుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అనుసరించాల్సిన వ్యూహం, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై చర్చ జరగనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. లాక్‌డౌన్ నుంచి బయటపడటం, ప్రస్తుతం ఆంక్షల సడలింపుతో పరిశ్రమలు పనిచేస్తున్న తీరు, వాటి రవాణా తదితర అనేక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది.

భారత్ :

మొత్తం కేసులు : 19,693

మృతులు : 603

రికవరీ : 3260

తెలంగాణ :

మొత్తం కేసులు : 928

మృతులు : 23

రికవరీ : 194

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు : 757

మృతులు : 22

రికవరీ : 96

Tags: India, Corona, Positive, Rapid Testing Kits, ICMR, Maharashtra, Death

Next Story

Most Viewed