మహారాష్ట్ర కోవిడ్ రోగులు హైదరాబాద్‌కు

by  |
మహారాష్ట్ర కోవిడ్ రోగులు హైదరాబాద్‌కు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో రోజూ నమోదయ్యే కరోనా కేసుల్లో సగ భాగం మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. దీంతో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధించింది. అయితే మహారాష్ట్రకు చెందిన కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో 20 శాతం నుంచి 30 శాతం బెడ్స్ మహారాష్ట్రకు చెందిన కోవిడ్ రోగులతో భర్తీ అయ్యాయి. మహారాష్ట్రలో హాస్పిటల్స్‌లలో బెడ్స్ ఖాళీగా ఉండకపోవడంతో.. బోర్డర్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు కరోనా రోగులు వస్తున్నారు.

‘మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో కరోనా రోగులు వస్తున్నారు. తమ ఆస్పత్రిలో ఏపీకి చెందిన రోగులు ఏడు శాతం మాత్రమే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నివాసితులు 70% మంది ఉన్నారు. ఏపీ కంటే మహారాష్ట్రకు చెందిన రోగులు ఎక్కువమంది ఉన్నారు’ అని యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు.

అటు, ‘మహారాష్ట్రలోని చిన్న ఆసుపత్రుల నుంచి రిఫరెన్స్ ద్వారా తమ ఆస్పత్రికి రోగులు వస్తున్నారు. తీవ్రమైన కేసులను ఇక్కడికి రిఫర్ చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుండి మాకు ఎక్కువ కేసులు వస్తున్నాయి. కొన్ని మారుమూల జిల్లాల్లో ICU, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు లేవు. ఆధునాతన చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారు’ అని కిమ్స్ ఆసుపత్రిలోని అత్యవసర వైద్య సేవల HOD డాక్టర్ ప్రవీణ్ అన్నారు.

Next Story