గులకరాళ్లే కాన్వాస్‌గా.. ప్రముఖుల అద్భుత చిత్రాలు

by  |
గులకరాళ్లే కాన్వాస్‌గా.. ప్రముఖుల అద్భుత చిత్రాలు
X

దిశ, ఫీచర్స్: చిన్నతనంలో చాలామంది ‘గులకరాళ్ల’ను పోగు చేసుకొని, వాటితో ఆటాలాడేవాళ్లు. మనలో చాలామందికి అవి ఆటవస్తువుల్లా మాత్రమే కనిపించేవి. కానీ గులకరాళ్ల కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉండే నదుల్లోని రాళ్లు, మహారాష్ట్రకు చెందిన సుమన్ దబోల్కర్ కంటికి మాత్రం అద్భుతమైన కాన్వాస్‌‌లా కనిపించాయి. అప్పటి నుంచి రాయి ఆకారం, పరిమాణాన్ని బట్టి వాటిపై ప్రామినెంట్ పర్సనాలిటీల చిత్రాలను అద్భుతంగా చిత్రిస్తున్నాడు సుమన్. ఇక కొవిడ్ 19 లాక్‌డౌన్.. తన కళకు వన్నెలద్దుకునేందుకు, సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగపడగా.. ప్రకృతికి దగ్గరగా ఉండే కళను, ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఆర్ట్ గ్యాలరీలను సందర్శించని వారిలోనూ ఆర్ట్ పట్ల అవగాహన కల్పించాలనే సంకల్పంతో సుమన్ ముందుకు సాగుతున్నాడు.

థానేలోని ఓ స్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న సుమన్ దబోల్కర్, కరోనా లాక్‌డౌన్ వల్ల తన సొంతూరైన సింధుదుర్గ్ జిల్లాలోని కన్‌కవ్లి ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఈ ప్రాంతం అందమైన నదులు, సుందరమైన సరస్సులకు ఆలవాలం కాగా, దబోల్కర్ ప్రతీరోజు నదీ ప్రాంతానికి వెళ్లి సేదతీరేవాడు. ఉరకలేస్తున్న నదీ జలాలు, అక్కడ విస్తారంగా పరుచుకున్న గులకరాళ్లతో అతడు ప్రేమలో పడిపోయాడు. ఆ సహజ సౌందర్యానికి ఆకర్షితుడైన సుమన్‌కు, అక్కడున్న గులకరాళ్లలో జీవం ఉట్టిపడేలా చేయాలన్న ఆలోచన తట్టింది.

ఈ క్రమంలో రాళ్ల సహజ ఆకృతికి ఎటువంటి మార్పులు చేయకుండానే వాటిపై వివిధ వ్యక్తులు, జంతువులు, కార్టూన్‌ చిత్రాలను యాక్రిలిక్ రంగులను ఉపయోగించి గీయడం ప్రారంభించాడు. వివిధ ఆకారాలు, పరిమాణాల ఆధారంగా వాటికి ఎవరి ముఖచిత్రం అయితే బాగుంటుందో మనసులోనే రూపాలను ఊహించుకుని అద్భుతమైన చిత్రాలను గీశాడు. ఈ క్రమంలోనే ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఛత్రపతి శివాజీ, బాబా సాహెబ్ అంబేడ్కర్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం, క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, హర్భజన్ సింగ్, యాక్టర్ సోనూ సూద్, నసీరుద్దీన్ షా, పోయెట్ నారాయణ్ సర్వీ’తో పాటు మరెంతోమంది ప్రామినెంట్ పర్సనాలిటీల చిత్రాలను రాళ్లపై ఆవిష్కరించాడు.

‘ప్రకృతి తరుచూ మన మనసు, ఆత్మపై ఒక ముద్ర వేస్తుంది. ఓ కళాకారుడిగా వాటిని నా చిత్రాల్లో ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తాను. ప్రకృతి ఒక భారీ కాన్వాస్, అది మనకు ఎన్నో పాఠాలు చెబుతుంది. మరెన్నో ఆసక్తికరమైన అంశాలను బోధిస్తుంది’ అని సుమన్ అభిప్రాయపడ్డారు. కాగా 2019లో వియత్నాంలో జరిగిన అంతర్జాతీయ కళా ప్రదర్శనకు భారతదేశం నుండి సుమన్ దబోల్కర్ పార్టిసిపేట్ చేయడం విశేషం.



Next Story

Most Viewed