అక్కడ ప్రస్తుతం ఇదే జరుగుతోన్నది..!

by  |
అక్కడ ప్రస్తుతం ఇదే జరుగుతోన్నది..!
X

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో సుదీర్ఘ కాలం తరువాత చేపడుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతం చేశారు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ తరుణంలో పనులు నిర్వహించడానికి అనువుగా ఉండడంతో పనుల వేగం పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఇందుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి పొడవునా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రహారి గోడలను కూల్చివేశారు. దీంతో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న రహదారి విస్తరణ పనులు వేగం అందుకున్నాయి. అదే సమయంలో రోడ్డుకు ఇరు వైపులు ఉన్న వివిధ చిరువ్యాపారులకు సంబంధించిన షెడ్లను తొలగించి ఆ స్థానంలో కొంత వెనక భాగాన నూతన షెల్టర్ల నిర్మాణం చేపట్టారు.

చౌరస్తాలు కూడా..

నగరంలోని అన్ని ప్రధాన రహదారులపై ఉన్న చౌరస్తాల వెడల్పు కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడా చౌరస్తాల పనులను వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన 15 రోజులలో జిల్లా కేంద్రంలోని చాలా ప్రాంతాల్లో కూల్చివేత పనులను ప్రారంభించిన అధికారులు ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులను చేపట్టారు. వచ్చే వారం, పది రోజుల్లో ఈ పనులను పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ షాపుల యజమానులకు కూడా రోడ్డు విస్తరణకు సంబంధించిన నోటీసులు ఇచ్చిన అధికారులు వాటిని కూల్చివేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగిం చేసుకుని ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతమే పనులు చేపడతారా లేక దానికి ఇంకా సమయం తీసుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Tags: Mahabubnagar, Traffic, Road widening works, Speed up, Minister Srinivas Goud



Next Story

Most Viewed