అక్కడ వర్షం పడితే అంతే సంగతి!

by  |
అక్కడ వర్షం పడితే అంతే సంగతి!
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : అన్ని రకాలుగా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని చెబుతున్న నాయకుల మాటలు కోటలు దాటుతున్న చేతలు గడప దాటడం లేదు. జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షాల వల్ల పలు కాలనీల వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారీ వర్షాకాలం వచ్చిందంటే జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు, కొత్త చెరువుల నుంచి నీరు పొంగిపొర్లి ఇండ్లలోకి చేరుతోంది. వర్షాకాలం వచ్చిన సమయంలో హడావుడి చేసే నాయకులు, అధికారులు తర్వాత మాత్రం వాటి గురించి మర్చిపోతున్నారు.

ఇటీవలే రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రం అతలాకుతలం అయింది. వర్షం కారణంగా చెరువు పొంగిపొర్లడంతో రామయ్య బౌలి ప్రాంతంలోని ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా ఇండ్లలోకి నీరు చేరడంతో శుక్రవారం ఉదయం కాలనీవాసులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దీనిపై అధికారులు సైతం స్పందించకపోవడంతో కాలనీ యువకులు మోటార్లు పెట్టి నీటిని ఇంటి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. చెరువు నీరు వచ్చి చేరడంతో కాలనీ అంతా దుర్గంధంగా మారింది.

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట వర్షపు నీరు నిలుస్తున్నది. దీంతో కార్యక్రమం లోపలికి వెళ్లే పరిస్థితి సైతం లేకుండా పోతుంది. దీనికి ఎదురుగా ఉన్న బస్టాండ్‌లోకి సైతం వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రదేశంలో వర్షపు నీరు నిలిచిపోవడం కారణంగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇది నిత్యకృత్యమైనా నేటికీ అధికారులు శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నారు.

వర్షానికి క్రిస్టియన్‌పల్లి శ్రీరామ కాలనీ ఎంవీఎస్ కాలేజ్ పక్కన ఎనక సైడు దొంగల కుంట నీరు మొత్తం ఇండ్లలోకి వస్తున్నది. వర్షం కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటున్నదని కాలనీవాసులు వాపోతున్నారు. అదే సమయంలో వర్షానికి అల్ మాస్ ఫంక్షన్ హాల్, చెరువుకట్ట కింద బీకే రెడ్డి కాలనీలోకి నాలా నీటిలో చెరువులోని గుర్రపు డెక్క మొత్తం కొట్టుకువచి రోడ్డు పై అడ్డంగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా నాయకులు, అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీలవాసులు కోరుతున్నారు.



Next Story

Most Viewed