మానుకోటలో వాల్ పోస్టర్ల కలకలం.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

by  |
మానుకోటలో వాల్ పోస్టర్ల కలకలం.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : నా చావుకు మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయక్ కార‌ణ‌మ‌వుతారని పేర్కొంటూ మ‌మ‌త(మహిళ) అనే పేరుతో శుక్రవారం జిల్లా కేంద్రంలో పోస్టర్లు క‌ల‌క‌లం రేపాయి. మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయ‌క్ ఫొటో, కుర‌వి మండ‌లం తాత్య తండా స‌ర్పంచ్ భూక్య ర‌మేష్ ఫొటోల‌తో కూడిన వాల్ పోస్టర్లు మానుకోట‌లోని అంబేద్కర్ సెంట‌ర్‌లో గోడ‌ల‌కు అంటించారు. క్రిమినల్స్‌కు స‌పోర్ట్ చేస్తున్నారంటూ స్థానిక జిల్లా క‌లెక్టర్‌పై కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

దీనికితోడు ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ క్రిమిన‌ల్స్‌కు అండ‌గా ఉంటున్నారని పోస్టర్‌లో మమత ఆరోపించింది. భూక్య ర‌మేష్‌పై ఫిర్యాదు చేసి 8 నెల‌లు గ‌డుస్తున్నా పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని.. త‌న‌ను శారీర‌కంగా హింసించిన‌ తాత్య తండాకు చెందిన ర‌మేష్‌తో పాటు భూక్య ఈరి, భూక్య చందు, బోడ మ‌హేష్‌, బోడ కాంతిల‌పై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుని రిమాండ్‌కు పంపాల‌ని కోరింది. అలాగే ర‌మేష్‌ను వెంట‌నే స‌ర్పంచ్ ప‌ద‌వి నుంచి స‌స్పెండ్ చేయాల‌ని పోస్టర్‌లో డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇంతకీ మ‌మ‌త ఎవ‌రు..? భూక్య ర‌మేష్ ఆమెకు చేసిన అన్యాయం ఏంటీ..? జ‌రిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు కేసు న‌మోదు చేయలేదు..? అనే విష‌యాలు మానుకోటలో సంచలనం రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed