సెలెబ్రిటీల ట్వీట్లపై దర్యాప్తు

by  |
సెలెబ్రిటీల ట్వీట్లపై దర్యాప్తు
X

ముంబయి: రైతు ఆందోళనలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైనప్పుడు కేంద్రానికి మద్దతుగా ట్వీట్లు చేసిన కొందరు భారత సెలెబ్రిటీలపై దర్యాప్తునకు మహారాష్ట్ర ఆదేశించింది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కును కలిగి ఉన్నారని, కానీ, వారంతా ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి చేశారన్న అనుమానాలపై దర్యాప్తు చేయాల్సి ఉన్నదని కాంగ్రెస్ మహారాష్ట్ర జనరల్ సెక్రెటరీ సచిన్ సావంత్ అన్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పాప్ స్టార్ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌ల ట్వీట్లలతో అంతర్జాతీయ చర్చకు తెరలేసిన సంగతి తెలిసిందే. రిహానా ట్వీట్ చేయగానే కేంద్ర విదేశాంగ శాఖ జాగ్రత్తగా స్పందించాలని ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటన తర్వాత భారత్‌లో అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్, సచిన్ టెండూల్కర్, సునీల్ షెట్టి సహా పలువురు స్పోర్ట్స్ పర్సన్లు, నటులు ఒకే తరహా ట్వీట్లు దాదాపు ఒకే సమయంలో పోస్టు చేశారని, వీరిపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు జరిగాయా? అన్న అనుమానాలు వస్తున్నాయని సావంత్ వివరించారు. అందుకే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అభ్యర్థించామని, ఆయన ఇంటెలిజెన్స్ శాఖకు ఆదేశాలిచ్చారని తెలిపారు. అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్ అచ్చుగుద్దినట్టు ఒకే తరహా ట్వీట్‌ను పోస్టు చేశారని, సునీల్ షెట్టీ ఓ బీజేపీ నేతను ట్యాగ్ చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు హోం మినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.



Next Story