పతంజలి.. ‘కరోనిల్’ పేరు వాడొద్దు

by  |
పతంజలి.. ‘కరోనిల్’ పేరు వాడొద్దు
X

చెన్నై: పతంజలి, దివ్య మందిర్ యోగ ట్రస్ట్‌లకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దగ్గు, జలుబు, జ్వరాన్ని తగ్గించే మందుకు ‘కరోనిల్’ పేరును వినియోగించవద్దని, ప్రజల భయాన్ని సొమ్ముచేసుకోవద్దని హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పటికే ఈ పేరును 1993 జులైలో చెన్నైకి చెందిన ఆరుద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేసుకున్నదని, ముందుగా అది తెలుసుకోకపోవడం పతంజలి పొరపాటేనని స్పష్టం చేసింది.

అంతేకాదు, పతంజలి, దివ్య మందిర్ యోగ ట్రస్టులకు రూ. పది లక్షల జరిమానా విధించింది. కరోనిల్ పేరును పతంజలి ప్రకటించిన నేపథ్యంలో ఆరుద్ర ఇంజనీరింగ్ ప్రవైట్ లిమిటెడ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జులై 17 విచారణలో పతంజలి ఈ పేరును వినియోగించరాదని 31వ తేదీ వరకు స్టే విధించింది. ఈ స్టే ఎత్తేయాలని పతంజలి కోరింది. చెన్నై కంపెనీ కరోనిల్ పేరును 1993 జులైలో రిజిస్టర్ చేసుకున్నదని నిరూపించుకున్నదని, 2027 వరకు ఆ పేరుపై హక్కులను కలిగి ఉన్నదని కోర్టు తెలిపింది. కరోనిల్ పేరు వాడటానికి చెన్నై కంపెనీ నుంచి అనుమతి తీసుకోలేదని వివరించింది.

ఈ పేరు రిజిస్ట్రేషన్ కోసం పతంజలి కేవలం దరఖాస్తు మాత్రమే చేసుకున్నదని, అదిప్పుడు ప్రాథమిక దశ పరిశీలనలో ఉన్నదని కోర్టు ఆగ్రహించింది. ఆ పేరు రిజిస్టరై ఉన్నదో? లేదో? చూసుకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీదేనని, చూడకపోవడం వారి పొరపాటేనని స్పష్టం చేసింది. అదీగాక, కరోనా ఆపత్కాలంలో ఆ మహమ్మారిని నివారించలేని ఈ ట్యాబెట్లు కరోనిల్ పేరుతో విక్రయించాలనుకోవడం అభ్యంతరకరమని మండిపడింది.

కరోనిల్ ట్యాబ్లెట్లు కరోనాను నివారిస్తుందని పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర ఆయుష్ శాఖ మాత్రం వెంటనే ఈ మాత్రల అమ్మకాలపై ఆంక్షలు విధించింది. తర్వాత ఈ ట్యాబ్లెట్లను కేవలం ఇమ్యూనిటీ బూస్టర్‌లుగా మాత్రమే విక్రయించుకోవాలని, కరోనా నివారిణిగా కాదని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed