మధు యాష్కీ వాస్తవాలను మాట్లాడారు : విజయశాంతి

by  |
మధు యాష్కీ వాస్తవాలను మాట్లాడారు : విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ ఉన్న విజయశాంతి ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ శుక్రవారం మాత్రం రెండు మూడు పొడి వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలపైనే కామెంట్ చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ మాత్రం వాస్తవాలను మాట్లాడారని ఆమె తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. దీనిపై ఆయనకు విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన మధుయాష్కీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి సేవలను రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయిందని అన్నారు. ఆమెతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ సమావేశమయ్యారని, కాంగ్రెస్ పార్టీని ఆమె వీడబోరని విశ్వాసం వ్యక్తం చేశారు.

పార్టీతో విజయశాంతికి ఏర్పడిన భిన్నాభిప్రాయాలు, సమస్యలను మాణిక్యం ఠాగూర్ పరిష్కరిస్తారని, ఆమె కాంగ్రెస్ పార్టీని వీడుతారని తాను భావించడంలేదని మధుయాష్కీ నిజామాబాద్‌లో మాట్లాడారు. దీని తర్వాత విజయశాంతి సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఒకప్పుడు బీజేపీలో సీనియర్ స్థానంలో ఉన్న విజయశాంతికి ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆమెకు స్వీయానుభవమేనని, తన కంటే ఆమెకు ఆ వాస్తవం ఎక్కువగా తెలుసని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బీజేపీ గూటికి చేరుతారని అనుకోలేమన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతున్నందున పార్టీలో అంతర్గతంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మధు యాష్కీ అభిప్రాయపడ్డారు. గతంలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న రామచంద్ర కుంతియా పార్టీ అధిష్టానానికి సరైన నివేదికలు ఇవ్వకపోవడంవల్లనే రాష్ట్ర పరిస్థితులకు తగినట్లుగా సరైన నిర్ణయాలు వెలువడలేదన్నారు. విజయశాంతి సేవలను పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం పీసీసీ చీఫ్ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు మాణిక్యం ఠాగూర్ సమర్పించే నివేదిక ఆధారంగా ఉంటుందని మధు యాష్కీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed