ఇకపై భారత్‌లోనే ఐఫోన్ 12 తయారీ!

by  |
ఇకపై భారత్‌లోనే ఐఫోన్ 12 తయారీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన ఐఫోన్ 12 మోడల్ స్మార్ట్‌ఫోన్ తయారీని ఈ ఏడాది ప్రారంభించనున్నట్టు బుధవారం తెలిపింది. దీనికోసం కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని చైనా నుంచి భారత్‌కు తరలించాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ కాంట్రాక్ట్ తయారీ భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ నుంచి భారత్‌లో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11లు తయారవుతున్నాయి. ఈ పరికరాల ప్రో మోడల్స్ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఐఫోన్ 12 మోడళ్లను భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..యాపిల్ తన ఉత్పత్తుల్లో కొన్నింటిని భారత్‌కు మార్చడం కంపెనీకే కాకుండా, దేశీయంగా ఎగుమతులను పెంచాలని భావిస్తున్న భారత ప్రభుత్వానికి కూడా కలిసిరానుంది. గతేడాదిలో యాపిల్ దేశీయంగా మెరుగైన అమ్మకాలను సాధించింది. అయితే, ఇప్పటికీ భారత్‌లో ఉత్పత్తి తక్కువగా ఉండటం యాపిల్ సంస్థకు సవాలుగా మారుతోంది.

దీన్ని అధిగమించేందుకే భారత్‌లో ఐఫోన్ 12 తయారీ చేపడుతోందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, స్థానికంగానే తయారీని చేపట్టడం ద్వారా స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గే అవకాశముంది. దీనిపై స్పష్టత లేకపోయినప్పటికీ కొంత మార్పు అయితే ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లో తయారయ్యే ఐఫోన్ 12 మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని యాపిల్ భావిస్తోంది. దీనివల్ల యాపిల్ సంస్థకు దిగుమతి సుంకాల భారం కూడా తగ్గనుంది. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 12 ఏప్రిల్-మే నుంచి అందుబాటులో ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story