కొత్త ట్రాక్టర్ కె2 సిరీస్ కోసం మహీంద్రా రూ. 100 కోట్ల పెట్టుబడి!

by  |
కొత్త ట్రాక్టర్ కె2 సిరీస్ కోసం మహీంద్రా రూ. 100 కోట్ల పెట్టుబడి!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మంగలవారం తన కొత్త ట్రాక్టర్ సిరీస్ కె2ను తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ప్లాంట్‌లో 2024 నాటికి రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు, అలాగే, రెట్టింపు స్థాయిలో ఉద్యోగాలని కల్పించనున్నట్టు కంపెనీ తెలిపింది. కొత్త కె2 సిరీస్ మహీంద్రా ట్రాక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మక లైట్-వెయిట్ ట్రాక్టర్ ప్రోగ్రామ్. ఇది అంతర్జాతీయంగా నాలుగు ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం వివిధ హార్స్‌పవర్(హెచ్‌పీ)లతో కూడిన 37 మోడళ్లను కంపెనీ ప్రవేశపెడుతుందని ఎంఅండ్ఎం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కొత్త ట్రాక్టర్ సిరీస్‌ను జపాన్‌కు చెందిన మిత్సుబిషి మహింద్రా అగ్రికల్చరల్ మెషినరీ, భారత మహీంద్రా రీసెర్చ్ విభాగం నుంచి ఇంజనీర్లతో అభివృద్ధి చేశారు.

ఈ సిరీస్‌లో మహీంద్రా సబ్-కాంపాక్ట్, కాంపాక్ట్, స్మాల్-యుటిలిటీ, లార్జ్ యుటిలిటీ నాలుగు ట్రాక్టర్ విభాగాలను, వివిధ హెచ్‌పీ పాయింట్లతో 37 మోడళ్లను తీసుకొస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు, మార్కెట్ల అంచనాలు, విభిన్న ప్రాంతీయ అవసరాలను తీర్చేందుకు కె2 సిరీస్ ప్రాజెక్ట్‌పై కంపెనీ దృష్టి పెట్టిందని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ చెప్పారు. ‘తమ ప్రాజెట్ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అందుతోంది. సవాళ్లను ఎదుర్కొని, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలను గణనీయంగా మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు’ రాజేశ్ పేర్కొన్నారు.

Next Story