L&T తొలి త్రైమాసిక లాభం రూ. 537 కోట్లు!

by  |
L&T తొలి త్రైమాసిక లాభం రూ. 537 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా ప్రభావంతో ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుర్బో (ఎల్అండ్‌టీ) సంస్థ లాభాలు భారీగా క్షీణించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎల్అండ్‌టీ నికర లాభం 68.73 శాతం క్షీణించి రూ. 536.88 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 1,697.62 కోట్లుగా ఉంది. ఇక, తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 27 శాతం తగ్గి రూ. 22,037.37 కోట్లకు చేరుకుంది. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోవడంతో ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అంతరాయం ఏర్పడిందని కంపెనీ మేనేజ్‌మెంట్ గతంలోనే తెలిపింది. ‘దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఆదాయం క్షీణించింది. దీంతో తయారీ, నిర్మాణా కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్మికులు లేకపోవడం, సరఫరా వ్యవస్థ అంతరాయం కూడా ఆదాయంపై ప్రభావం చూపించినట్టు’ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అలాగే, ఈ త్రైమాసికంలో అంతర్జాతీయ ఆదాయం రూ. 9,497 కోట్లతో మొత్తం ఆదాయంలో 45 శాతంగా ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో మున్ముందు సంస్థను మునుపటి స్థాయికి తీసుకెళ్లడం, కార్యకలాపాల సామర్థ్యం, ద్రవ్యత, కఠినమైన వ్యయ నియంత్రణ, కొత్త పని వాతావరణంతో విజయవంతంగా కొనసాగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.



Next Story