ముస్లిం సమాజంలో ఇది ఫస్ట్..

by  |
ముస్లిం సమాజంలో ఇది ఫస్ట్..
X

దిశ, న్యూస్ బ్యూరో: కోవిడ్‌తో మరణించిన కుటుంబాలు వేదనకు గురవుతున్నాయి. చనిపోయిన వారికి గౌరవ సూచకంగా ఇరుగు పొరుగు, సమీప బంధువులెవరూ అంతిమయాత్రలో పాల్గొనడం లేదు. కుటుంబ సభ్యులే నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో అంతిమ యాత్రకు సేవలందించే వారు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయిన వారి పట్ల చాలా మంది నిరాదరణ చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో అనేక సహాయక చర్యలను అందిస్తున్న నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ అంత్యక్రియలకు సేవలు కూడా అందించేందుకు ముందుకొచ్చింది. ముస్లిం సమాజంలో ఇటువంటి ప్రొఫెషనల్‌ సేవలను అందించడం ఇదే తొలిసారి. ఈ సేవల కోసం రూ.16.50 లక్షలకు పైగా విలువ చేసే బీఎస్‌-4కు చెందిన టాటా వింగర్‌ మోడల్‌తో అత్యాధునిక హంగులు కలిగిన ఆరు అంబులెన్స్‌లను ప్రారంభించింది.

ఈ అంబులెన్స్‌లు 24/7 సేవలు అందిస్తాయి. ప్రతి ఒక్క అంబులెన్స్‌ కొలాప్సిబుల్‌ స్ట్రెచస్‌, స్ట్రెచర్‌ను కవర్‌ చేయడానికి ప్లాస్టిక్‌ షీట్లును కలిగి ఉన్నాయి. మృతదేహాలను సురక్షితంగా ఖననం చేయడంలో మహమ్మారి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం శానిటైజేషన్‌ను అత్యధిక ప్రమాణాలతో పాటిస్తున్నారు. అంబులెన్స్‌ వాహనాన్నింటిని జీపీఎస్‌తో అనుసంధానించడమే కాకుండా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ 9603540864/8977898706 ఫోన్‌ నెంబర్ల ద్వారా మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ముస్లిం సామాజిక మత సంస్థలు, మసీదు, మర్కాజ్‌తో మహమ్మారి కాలంలో కోవిడ్‌తో మరణించిన వారికి అంతిమసంస్కారాలు నిర్వహించే సదుపాయాలు అందిస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో హెచ్‌హెచ్‌ఎఫ్‌ ఒప్పందం చేసుకుంది. కోవిడ్‌తో మరణించిన ముస్లిం వర్గాలకు చెందిన వారిని కోవిడ్‌ కోసం ప్రత్యేకించిన బాలాపూర్‌ శ్మశానవాటికలో ఖననం చేస్తున్నారు. ఇప్పటికే నిండిపోయిన ఇతర శ్మశానవాటికలలో కూడా కోవిడ్‌ కేసులను ఖననం చేసేందుకు అంగీకరిస్తున్నాయి. శవానికి మహమ్మారి మార్గదర్శకాల ప్రకారం గుసూల్‌ చేయడం, శ్మశానవాటికకు తరలించడం, ఖననం చేసే ముందు ముస్లిం మత ఆచారం ప్రకారం ప్రార్థనలు (నమాజ్‌ ఎ జనాజ) వంటి అంతిమ సంస్కారాలు చేసి అన్ని సేవలు అందించి సమాధి చేయడం జరుగుతుందని ఫౌండేషన్‌ మేనేజర్‌ అడ్మిన్‌, హెచ్‌ఆర్‌ లాజిస్టిక్స్‌ ఫరీద్‌ ఫాహిమ్‌ తెలిపారు.

అత్యవసరాల్లో శిక్షణ..

అంబులెన్స్‌ను నడిపే డ్రైవర్లందరూ ఎమర్జెన్సీ మెడికల్‌ కార్యకలాపాల్లో శిక్షణ పొందారు. పీపీఈ కిట్లు, క్రిమిసంహారక, స్ప్రెయర్లు, లెనిన్‌, పీపీఈ కిట్లను పారవేయడానికి చెత్త సంచులు, వాటర్‌ క్యాన్లు, శుభ్రం చేసుకోవడానికి సబ్బు వంటివి అందుబాటులో ఉంచుతారు. వాటితో పాటు అంబులెన్స్‌లు ప్రతీ ట్రిప్‌ పూర్తి చేసుకున్న తర్వాత స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాయం వద్ద క్రిమిసంహారకాలతో శుద్ధి చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం భద్రత, పారిశుద్ధ్యం, రక్షణ ప్రమాణాలు పాటిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

పీపీఈ కిట్లు, మాస్కులు, డిస్‌ఇన్‌ఫెక్షన్‌, శానిటైజర్లు, డ్రైవర్ల జీతాలు, వాహన ఇంధనం కోసం ఎలాంటి లాభాపేక్షలేని ప్రాతిపదికన రూ.3 వేలు మొదలుకుని రూ.5 వేలు మించకుండా నామమాత్రపు రుసుంను వసూలు చేస్తున్నారు. పేదవర్గాల వారికి ఉచిత సేవలు అందిస్తున్నారు. ‘కోవిడ్‌తో మరణించిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు భయపడుతున్నారు. నాన్‌-కోవిడ్‌ మరణాల అంతిమ సంస్కారాలకు కూడా అదే పరిస్థితిని మేము గమనించాం. ఈ పరిస్థితులలో అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించి బాధిత కుటుంబాలకు సహాయపడడం కీలకమని మేం భావించాం.’ అని ఫౌండేషన్‌ సభ్యులు ముజ్తబా హసన్‌ అక్సారీ తెలిపారు.


Next Story

Most Viewed