20 నిమిషాల్లో కరోనా టెస్ట్?

by  |
20 నిమిషాల్లో కరోనా టెస్ట్?
X

వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే సమయంలో వేగంగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసం ఎక్కువ మంది సిబ్బందిని వినియోగించి వారి ప్రాణాలకు ముప్పు కలిగించలేం. కాబట్టి త్వరగా టెస్టులు చేయగల విధానాన్ని అమలు చేయడమే ఉత్తమ పని. ఇందుకు సాయం చేయడానికి ఐఐటీ హైద్రాబాద్ పరిశోధకులు తమ వంతు సాయంగా ఒక టెస్ట్ కిట్‌ను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ టెస్ట్ కిట్ ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో కరోనాను గుర్తించవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం కరోనా పాజిటివ్ అని గుర్తించడానికి చేస్తున్న రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) టెస్టుకు ప్రత్యామ్నాయంగా తాము సరికొత్త టెస్టును రూపొందించినట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ టెస్ట్ కిట్ విలువ రూ. 550 కాగా, పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తే రూ. 350కే లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ ఆస్పత్రి ఈ టెస్టు కిట్ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించి కేవలం ఇరవై నిమిషాల్లోనే లక్షణాలు బయటకు కనిపించని వారిని కూడా గుర్తించవచ్చని ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ చెబుతున్నారు. కొవిడ్ 19 జీనోమ్‌లో ఉన్న ప్రత్యేక సుస్థిర ప్రదేశాల సీక్వెన్స్ ఆధారంగా ఈ కిట్ పనిచేస్తుందని ఆయన వివరించారు. దేశంలో కరోనా టెస్టు కిట్ రూపొందించిన రెండో విద్యాసంస్థగా ఐఐటీ-హైదరాబాద్ నిలిచింది. మొదటగా రియల్-టైమ్ పీసీఆర్ ఆధారిత డయాగ్నస్టిక్ టెస్టును ఐఐటీ ఢిల్లీ రూపొందించింది.


Next Story