రాష్ట్రంలో మరో సంచలనం.. గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో మరో సంచలనం.. గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేది లెఫ్ట్‌నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారీల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కన్యాకుమారి.. తమిళిసై సొంత జిల్లా.. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునల్వేలిలో అధికంగా నాడార్‌ ఓటు బ్యాంక్‌ ఉండటంతో ఈ స్థానాల్లో ఒకచోట తమిళిసై పోటీచేయనున్నారు. అయితే, 2019, సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన ఆమె.. అంతకుముందు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళిసై డీఎంకే అభ్యర్థి కనిమొజీ చేతిలో ఓటమి పాలయ్యారు.



Next Story

Most Viewed