RS ప్రవీణ్ కుమార్‌‌ను గెలిపించి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇద్దాం.. మాజీ మంత్రి పిలుపు

by Disha Web Desk 2 |
RS ప్రవీణ్ కుమార్‌‌ను గెలిపించి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇద్దాం.. మాజీ మంత్రి పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఎస్పీతో పొత్తుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం కలసికట్టుగా కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. వంద రోజుల కాంగ్రెస్ అసమర్ద పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దామని అన్నారు. రుణమాఫీ అటకెక్కింది.. రుతుభరోసా ఆగిపోయిందని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 భృతి పథకాల ఊసెత్తడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం భర్తీచేసిన 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. సాగునీళ్లు ఆగిపోయాయి.. తాగునీళ్లకు కరువొచ్చిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదు.. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని సీరియస్ అయ్యారు. పదేళ్లలో పచ్చబడ్డ పాలమూరు మళ్లీ భీడు భూములతో దర్శనమిస్తుందని అన్నారు. కరంటు కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారు.. అర్దరాత్రి కరంటు కోసం రైతులు నిద్దుర కాయాల్సిన దుస్థితిని మళ్లీ కాంగ్రెస్ మళ్లీ తీసుకువచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఈ మార్పులను గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌తోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలం.. నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని చెప్పారు.

Read More : BRS పార్టీ‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే

Next Story

Most Viewed