నేడే కాంగ్రెస్ తొలి జాబితా !.. అర్ధరాత్రి దాటినా ముగియని చర్చలు

by Dishanational5 |
నేడే కాంగ్రెస్ తొలి జాబితా !.. అర్ధరాత్రి దాటినా ముగియని చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశమైంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. జోడో యాత్రలో భాగంగా జైపూర్‌లో ఉన్న రాహుల్ గాంధీ.. వర్చువల్‌గా పాల్గొనాల్సి ఉండగా, పలు కారణాలరీత్య అది కుదరలేదు. తొలి జాబితాను గురువారమే ప్రకటిస్తారని భావించగా, అర్ధరాత్రి దాటినా చర్చలు ముగియకపోవడంతో శుక్రవారం వెలువరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ మళ్లీ వయనాడ్ నుంచే పోటీ చేయాలని కేరళలోని స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. వయనాడ్‌తోపాటు అమేథీ నుంచి సైతం పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నా.. దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం రాజకీయ అరంగేట్రం చేస్తారా? లేదా? అనేదానిపైనా అనిశ్చితి తొలగలేదు. ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటన్నింటిపై సుదీర్ఘ చర్చలు జరిగినందునే అర్ధరాత్రి దాటినా సమావేశం ముగియలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

మొదటి జాబితాలో చోటు దక్కేది వీరికే!

కాంగ్రెస్ తొలి జాబితాలో తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీ శశిథరూర్‌కు మళ్లీ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌‌లోని రాజ్‌నంద్‌గావ్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌, దుర్గ్‌ నుంచి తామ్రధ్వజ్‌ సాహు, కోర్బా నుంచి జ్యోత్స్నా మహంత్‌, జంజ్‌గిర్‌-చంపా స్థానం నుంచి శివ్‌ దేహరియాను కాంగ్రెస్‌ బరిలోకి దించే అవకాశం ఉంది. వీరేకాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి సైతం పలువురికి టికెట్ దక్కనున్నట్టు సమాచారం. అయితే, తొలి జాబితాలో ఎందరిని ప్రకటిస్తారనేదాని వివరాలు మాత్రం తెలియరాలేదు. బీజేపీ ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.




Next Story