అయోధ్య నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్.. ఖమ్మం అభ్యర్థి హామీ

by Disha Web Desk 2 |
అయోధ్య నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్.. ఖమ్మం అభ్యర్థి హామీ
X

దిశ బ్యూరో, ఖమ్మం: అయోధ్య నుంచి భద్రాచలం రాములవారి వరకు ఆధ్యాత్మిక కారిడార్ నిర్మిస్తామని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు వెల్లడించారు. బుధవారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో వినోద్ రావు మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితున్నయి తనతో పాటు అనేక మంది పార్టీలో చేరారని చెప్పారు. సామాజిక కార్యకర్తగా ఉన్న తాను.. బీజేపీలో చేరగానే పార్టీ తనకు ఖమ్మంలో పోటీచేసే అవకాశం ఇచ్చిందని తెలిపిన ఆయన తానొక సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.


స్పష్టమైన విజన్ ఉంది..

తాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలవాసినని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమస్యలు, అందుకు పరిష్కార మార్గాలు తనవద్ద ఉన్నాయని, స్పష్టమైన విజన్‌తోనే పార్టీలో చేరి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని పేర్కొన్నారు. మట్టివాసన తెలిసినవాడిగా, ఇక్కడి ప్రజాసమస్యలు తెలిసినవాడిగా పోటీలో దిగానన్నారు. ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అనేక నిధులు ఇచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అభివృద్ధి పనుల్లో ఇంకా వేగం పెంచుతామన్నారు. సేంద్రీయ వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ఎన్ఎండీసీలో ఖాళీగా ఉన్నస్థలాన్ని వాడుకలోకి తీసుకువస్తుమన్నారు. ఓపెన్ కాస్ట్‌లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకుని న్యాయం చేస్తామన్నారు.

టికెట్ ఎవరికొచ్చినా అందరిదే..

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి అనేక మంది ఆశించారని, కానీ టికెట్ ఎవరికి దక్కినా కలిసికట్టుగా ఉంటామని చెప్పారు. పార్టీ అభ్యర్థిని గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. టికెట్ ఆశించడం వేరు.. అభ్యర్థి కన్ఫార్మ్ అయ్యాక కుటుంబ సభ్యుల్లా మెలగడం వేరని తెలిపారు. జిల్లా పార్టీలో ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని అందరు సమిష్టిగా బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడేవారే ఉన్నారన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఖమ్మం ప్రజలు చాలా తెలివైనవారని, ఇక్కడ కమ్యూనిస్టులకు, టీడీపీకి, కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారని ఈ సారి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కొందరు బీజేపీలో చేరగా.. వినోద్ రావు కండువాకప్పి ఆహ్వానించారు.


Next Story

Most Viewed