రైతులు జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి : లోకేష్

by  |
రైతులు జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి : లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్ : నా అంతిమ శ్వాస వరకు ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలబడతానని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం అవనిగడ్డలో రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యలోని నిమ్మకూరులో రహదారిపై వెళ్తున్న రైతులను చూసి ఆగారు. ధాన్యం లోడ్‌లతో వెళ్తున్న ట్రాక్టర్లు ఆగడంతో అక్కడి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రైతులు పలు విషయాలు లోకేష్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం చెప్పినట్టుగా ధాన్యం కొనటం లేదని రైతులు లోకేష్ ఎదుట వాపోయారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, కానీ పండించిన ధాన్యం కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక నిబంధనలు పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆఖరికి తక్కువ రేటుకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. తుఫానులో దెబ్బ తిన్న ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ, రంగుమారిన, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనటం లేదని రైతులు లోకేష్ దృష్టికి తెచ్చారు. వారి ఆవేదనను విన్న లోకేష్ మాట్లాడుతూ.. రైతు వ్యతిరేఖిగా మారిన జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షాన తెలుగుదేశం పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

Next Story

Most Viewed