మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే భరించడం కష్టమే: మారుతీ సుజుకి చైర్మన్

by  |
మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే భరించడం కష్టమే: మారుతీ సుజుకి చైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం పరిష్కారం కాదని, దీనివల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందని మారుతీ సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ చెప్పారు. అంతేకాకుండా పేదలు, నగరాల్లో కార్మికులు ఉపాధికి దూరమవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లకు బదులుగా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు. చికిత్స అనేది వ్యాధి కంటే అధ్వాన్నంగా ఉండకూడదని భార్గవ అన్నారు. సుధీర్ఘమైన, ఎక్కువ ప్రాంతాల్లో లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందని, కర్మాగారాల్లో ఉత్పత్తి, డీలర్ల వద్ద అమ్మకాలు దెబ్బతింటాయని భార్గవ చెప్పారు.

మార్కెట్లను మూసివేయడం వల్ల డిమాండ్ క్షీణిస్తుందని, అమ్మకాలు పడిపోతే ఉత్పత్తిని కూడా ఆపేయాల్సి వస్తుందన్నారు. గతేడాదిలో ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మూసేయాల్సి వస్తే భరించే పరిస్థితి లేదని, మధ్యతరగతి, పేదలు తీవ్రంగా బాధపడతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో సాధారణ వ్యాపారా కార్యకలాపాలను కొనసాగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆర్ సి భార్గవ సూచించారు. ఇతర రంగాల్లో కూడా సాధారణ వ్యాపారం కొనసాగేలా చూడాలి. ఎవరైనా కొవిడ్ నిబంధనలు పాటించకపోతేనే వాటి కార్యకలాపాలను మూసేయాలన్నారు.



Next Story

Most Viewed