లాక్ డౌన్ ఉల్లంఘించిన ఖాకీలు..

by  |
లాక్ డౌన్ ఉల్లంఘించిన ఖాకీలు..
X

దిశ, న‌ల్ల‌గొండ‌: క‌రోనా వైరస్ (కోవిడ్ 19) మ‌హామ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 45, 46లను పోలీసులు కొంత‌ క‌ఠినంగానే అమ‌లు ప‌రుస్తున్నారు. గుంపులు గుంపులుగా జ‌నం బ‌య‌ట క‌నిపించినా‌, వాహ‌నాల‌పై ఇద్ద‌రు ముగ్గురు వెళ్తున్న పోలీసులు వారిని ఆపి చిత‌క బాదుతున్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పోలీసులు ఇన్నాళ్లూ దండాలు పెట్టి చెప్పారనీ, ఇకపై కఠినంగా వ్యవహరిస్తారని ప్రెస్ మీట్‌లో చెప్పారు. జ‌నాల్లో మార్పు రాకుంటే రోడ్ల మీద క‌నిపిస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్ ఇవ్వాల్సి వస్తదేమో అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అప్ప‌టి నుంచి పోలీసులు రాష్ట్రంలో రెచ్చిపోతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం ఆదేశాలూ జారీ చేసింది. అయితే, గురువారం తెలంగాణలోని గుండాల పీఎస్ పోలీసులు లాక్ డౌన్ ఉల్లంఘించి స్టేషన్‌లోనే బర్త్ డే వేడుకులు జరుపుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పోలీసు వర్గాల్లో, జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉల్లం‘ఘనుల’పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..

శ్రీ‌రామ న‌వ‌మి పండుగ రోజున వ‌న‌ప‌ర్తిలో కొడుకుతో క‌లిసి వెళ్తున్న‌ భార్య భ‌ర్త‌లను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ తండ్రిని లాఠీల‌తో చిత‌క బాదుతుంటే వ‌ద్దు అంకుల్ అంటూ ఆయ‌న కొడుకు ప్రాధేయ‌ప‌డుతు అంగ‌లార్చిన విడ‌వ‌కుండ పోలీసులు కఠినంగా వ్యవహరించి, బాదారు. ఖ‌మ్మంలో పేకాట ఆడుతూ దొరికిన ముగ్గురిని విక్ర‌మార్కుడు సినిమా స్టైల్లో అక్క‌డి ఎస్ఐ లాఠీలు విరిగేదాక కొట్టారు. వైర‌స్ సంక్ర‌మ‌ణ కాకుండా ఉండేందుకు జ‌నం పోగ‌య్యే పెండ్లీలు, శుభ‌కార్యాలు అన్నీ వాయిదా వేయించారు. చివరకు మ‌నిషి చనిపోతే అంత్యక్రియ‌ల‌కు సైతం ప‌ది మంది దాటొద్ద‌ని ఆంక్ష‌లు విధించారు. లాక్‌ డౌన్ అమ‌లు చేసేందుకు ఇంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. ఇదంతా ఒక వైపు రెండో వైపున పోలీసులే చట్టాన్ని ఉల్లఘింస్తున్నారాని తెలుస్తోంది. ఉల్లఘించారు కూడా. యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని గుండాల పోలీసులు. బాజాప్తాగా లాక్ డౌన్ ఉల్లంఘించారు. వివరాల్లోకెళితే..

గుండాల పోలీసులు పోలీస్‌స్టేష‌న్‌లోనే టెంట్లు వేశారు. మేక‌లు కోసి బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపారు. ఈ వేడుక‌ల‌కు గుండాల మండ‌లంలోని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను సైతం వారు ఆహ్వ‌నించ‌డం విశేషం. చ‌ట్టాన్ని అతిక్ర‌మించి ఖ‌ద్ద‌ర్ నేత‌ల‌తో క‌లిసి ఖాకీలు విందు, ప‌సందు చేసుకున్నారు. పీఎస్‌లో ప‌ని చేస్తోన్న ఓ కానిస్టేబుల్ కుమార్తె బ‌ర్త్ డే వేడుక‌లు ఇలా బ‌హిరంగంగా సామాజిక దూరం పాటించ‌కుండా గుంపులు గుంపులుగా అతిథులు, పోలీసుల కుటుంబీకులతో, సిబ్బంది మధ్య జరిగాయి. గురువారం రోజున శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా ఆల‌యానికి వెళ్తున్న భక్తలను అడ్డుకున్న పోలీసులు ఏకంగా పోలీస్ స్టేష‌న్‌లో‌నే విందులు చేసుకోవ‌డంపై నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

పోలీసులకు ఆంక్షలకు వర్తించవా?

శ్రీ‌రామ న‌విమి సంద‌ర్భంగా ఆల‌యాల్లో ఐదుగురికి మించి ఉండ‌కూడ‌ద‌ని పోలీసులు ఆంక్ష‌లు పెట్టారు. స్థానిక ఆల‌యంలో జ‌రిగిన క‌ళ్యాణోత్స‌వాన్ని తిల‌కించేందుకు భ‌క్తులు వెళ్ల‌కుండా ప‌గ‌లంతా వీరే అడ్డుకున్నారు. ఇంట్లో దేవుడి బొమ్మ‌పెట్టుకొని పూజించుకోవాలనీ, భద్రాచలం రాములోరి క‌ళ్యాణం టీవీల‌ల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతుంద‌ని టీవీ చూసి దేవున్ని మొక్క‌మ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. అంత చెప్పిన ఖాకీలు ఇప్పుడు బ‌ర్త్‌డే వేడుక‌లు ఇలా బ‌హిరంగంగా చేసుకోవడమేంటనీ.. అది పోలీస్‌స్టేష‌న్ అవ‌ర‌ణ‌లో ఎలా చేసుకుంటార‌ని స్థానికులు ప్ర‌శ్నిస్తోన్నారు. ఈ విందులో హాజ‌రైన ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసులు న‌మోదు చేసి విందులో పాల్గొన్న పోలీసుల‌ను స‌స్పెండ్ చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.



Next Story