చివరి వ్యక్తికి సాయమందేనా..

by  |
చివరి వ్యక్తికి సాయమందేనా..
X

– కుటుంబాన్ని గడిపేందుకు కార్మికుల అవస్థలు
– అగమ్యగోచరంగా వలస బతుకులు

దిశ, న్యూస్ బ్యూరో: లాక్ డౌన్ ఇబ్బందులను ప్రజల వరకూ చేరకుండా రేషన్ కార్డులపై అదనంగా బియ్యం, రూ.1,500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నగరంలో ఉంటున్న కుటుంబాలకు సొంత ఊర్లకు వెళ్లే పరిస్థితి లేదు. పోలీసు చెక్ పోస్టులు దాటనివ్వడం లేదు. మరో వైపు అసంఘత రంగాల్లో వలస వచ్చి పని చేస్తున్న వారికి ప్రభుత్వ రేషన్, స్థిర నివాసం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని కూడా పరిగణలోకి తీసుకొని సాయం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

నగరంలోని జనాభాలో మెజారిటీ వాటా వలస వచ్చినవారే.. విద్య, ఉద్యోగం, ఉపాది కోసం వచ్చిన వారంతా సిటీలో ఇప్పుడు ఉండలేక, వెళ్లలేక కష్టాలు పడుతున్నారు. జనజీవనం స్తంభించడంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మేరకు చర్యలు చేపట్టడంతో కొంత ఉపశమనం లభిస్తోంది. అయితే రేషన్ కార్డులు, మహిళా సంఘాల సభ్యత్వం ఉన్నవారికే ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందనున్నాయి. కంపెనీల్లో పనిచేసే కార్మికులకు, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు, దినసరి, అడ్డా కూలీలకు కనీసం ఆకలి తీర్చుకునే మార్గం కూడా కనిపించడం లేదు. వారి కోసం ప్రభుత్వం చేపడుతున్నామన్న చర్యలు కార్యాలయాలు దాటి బయటకు రాలేదు. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన కంపెనీలు మినహా మిగిలిన వాటిల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను యాజమన్యాలు ఇప్పటికే బయటకు పంపించాయి. హమాలీ, ట్రాన్స్ పోర్ట్, భవన నిర్మాణ రంగం, ఇండ్లల్లో పనిచేసేవారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. వీరికి ఇక్కడ రేషన్ కార్డులు కాదు కదా.. కనీసం గుర్తింపు కార్డులు కూడా లేవు. బోర్ వెల్స్, హమాలీ, కంపెనీ కార్మికుల్లో ఎక్కువగా బీహార్, కర్నాటక సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అధికం. సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక, తెలిసినవారు కనిపించక వీరిప్పుడు రోడ్లనే ఆవాసంగా మార్చుకుంటున్నారు. తినడానికి తిండిలేక ఆకలితో పడుకుంటున్నారు. ఆటో నగర్ ఏరియాలోనే ఆరు వేలు, గడ్డి అన్నారంలో మూడు వేలకు మందికి పైగా హమాలీ కార్మికులు ఉన్నట్టు అంచనా. భవన నిర్మాణ రంగంలో ఒక ఎల్బీనగర్ ప్రాంతంలోనే 7-8వేల మంది వరకూ ఉంటారు. ప్లంబింగ్, ఎలక్ర్టీషియన్ తదితర పనుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఏ సహాయం కూడా వీరికి వర్తించలేదు. పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన వారందరికీ సరైన తిండి, పని లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇండ్లలో పనిచేసే వారికి సైతం కుటుంబ కష్టాలు తప్పడం లేదు. మూడు- నాలుగు ఇండ్లల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నవారికి ఇప్పుడు పని లేకుండా పోయింది. ప్రభుత్వమిచ్చే సాయం ఊరట మాత్రమే గానీ అవసరమైన మేరకు లేదన్నది స్ఫష్టం. నగరంలో ఇలాంటి చిన్నా చితకా పనులు చేస్తున్న వారందరినీ లెక్కలోకి తీసుకుంటే లక్షల్లో ఉంటారు. వారిని కూడా ప్రభుత్వం ఈ ఆపత్కాల సమయంలో ఆదుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం సాయం అందుకోలేని వారిని గుర్తించి కుటుంబానికి అవసరమైన నిత్యవసరాలతో పాటు రూ.10 వేలు అందివ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.

రేషన్ కార్డులు ఉన్నా కూడా సొంతూళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేని వారికి కూడా ఆహారం, వసతి కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వారంతా కోరుతున్నారు. బాలానగర్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, ఆటోనగర్, ఐడీపీఎల్, చెంగిచర్ల, ఈసీయల్ ఏరియాల్లో లేబర్ పనులు చేసుకునే వలసదారులను ఆదుకోవాలని వారంతా కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed