లాక్ డౌన్ సడలింపులు.. ఒంటి గంట వరకు అనుమతి

by  |
లాక్ డౌన్ సడలింపులు.. ఒంటి గంట వరకు అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లాక్​డౌన్​ సడలింపు సమయం 7 గంటలకు పెరిగింది. ప్రస్తుతం రోజులో నాలుగు గంటలే ఆంక్షల నుంచి మినహాయింపు ఉండగా… దీన్ని ఏడు గంటలకు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి లాక్​డౌన్​ మరో పది రోజుల పాటు కొనసాగించాలని కేబినెట్​ నిర్ణయించింది. దీంతో జూన్​ 9 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉండనుంది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేటి నుంచి (మే 31) మరో పది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత (ఒంటి గంట తర్వాత) బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి మరో గంట పాటు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లాక్​డౌన్​ అమల్లోకి వస్తోంది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ భేటీలో వివరించారు. ఇక కరోనా నేపథ్యంలో జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ సంఖ్యలో హాజరై జరుపుకోవాలని, ఆయా జిల్లాల్లో మంత్రులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కేబినెట్​ సూచించింది.

ఇళ్ల‌కు చేరేందుకు గంట వెసులుబాటు

లాక్‌డౌన్ స‌డ‌లింపు సమయాన్ని ప్ర‌భుత్వం మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. స‌డలింపు స‌మ‌యం త‌ర్వాత బ‌య‌టికి వెళ్లిన ప్ర‌జ‌లు ఇళ్ల‌కు చేరుకోవ‌డానికి మ‌రో గంట పాటు అద‌న‌పు స‌మ‌యం ఇచ్చారు. ప్రస్తుతం ఉదయం 10 గంటల తర్వాత రవాణా వ్యవస్థ ఆగిపోవడంతో అత్యవసర సేవల్లోని సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వారికోసం ప్రత్యేక సర్వీసులు కూడా నడుపకపోవడంతో విధులకు వెళ్లేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయా కంపెనీలు, సంస్థలు, ఆస్పత్రులతో పాటు వివిధ చోట్ల పని చేసే సిబ్బంది మధ్యాహ్నం 1 గంటకు విధుల నుంచి రిలీవ్​ కావాల్సి ఉంటోంది. ఆ తర్వాత 2 గంటలలోపు ఇండ్లకు చేరుకోవాలి. ఆ తర్వాత వెళ్తే పోలీసుల నుంచి కష్టాలు తప్పవు. ఇక అత్యవసర సేవలు సహా గతంలో వెల్లడించిన కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి యథావిధిగా మినహాయింపు కొనసాగనుంది.

ఆ ప్రాంతాల్లో పర్యటించాలి

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించిన మంత్రివర్గం… వైరస్​ వ్యాప్తి తీరు, బాధితులకు అందుతున్నవైద్యం, నియంత్రణ కోసం వైద్యశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నదని వైద్యశాఖ అధికారులు కేబినెట్​కు వివరించారు. అయితే వ్యాప్తి ఎక్కువగా వున్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణ పేట్, మక్తల్, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్​నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో హెల్త్ సెక్రటరీతో పాటు రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు పర్యటించాలని, నిత్యం సమీక్షించి నియంత్రణ చర్యలను తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల పట్ల వైద్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలని, సంబంధిత నియంత్రిత ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా, తదితర దవాఖానల పరిస్తితుల మీద రివ్యూ చేయాలని, అన్నిరకాల మౌలిక వసతులను కల్పనకు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించింది.

కొత్తగా ఏడు మెడికల్​ కాలేజీలు

ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కేసులు పెరిగే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం లాక్​డౌన్​ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ బేటీ దాదాపు ఐదు గంటలపాటు కొనసాగింది. ఈ భేటీలో కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గం లాక్‌డౌన్‌తో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రావతరణ వేడుకలకూ దూరంగా ఉండనున్నారు. అంగరంగంగా వేడుకలు నిర్వహించరాదంటూ నిర్ణయించారు. దీనితో పాటుగా రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్​ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మంజూరయి వున్న వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా కేబినెట్ మంజూరు చేసింది. అదే విధంగా రాష్ట్ర వైద్యశాఖకు అదనంగా రూ.1000 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్​ భేటీలో తేల్చారు. ఇక విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్‌ వేసేందుకు నిర్ణయించారు. విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెలుతున్నవిద్యార్ధుల సౌకర్యార్ధం, వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని, ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాలని వైద్యశాఖను కేబినెట్ ఆదేశించింది.

ఇక వరంగల్​లో ప్రస్తుతం జైలు ఉన్న ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. జైలులో ప్రస్థుతం వున్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని, ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్దం చేసి, తర్వాత నిర్వహించే కేబినెట్​ భేటీకి తీసుకు రావాలని హోం శాఖ అధికారులకు సూచించారు.

రిజిస్ట్రేషన్లకు గ్రీన్​ సిగ్నల్​

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రస్తుతం నిలిపివేసిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌తో పాటు వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌కు నేటినుంచే కేబినెట్ అనుమ‌తించింది. లాక్​డౌన్ స‌డ‌లింపు స‌మ‌యాల్లోనే ఈ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. రిజిస్ట్రేషన్​, ఆర్టీఏ కార్యాలయాల్లో లాక్​డౌన్​ సడలింపు నిబంధనలను అనుసరిస్తూ ప్రభుత్వ పనిదినాల్లో స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రతి సబ్​ రిజిస్ట్రార్​ పరిధిలో 24 స్లాట్లను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. కేటాయించిన సమయంలోనే కార్యాలయాల పరిధికి రావాలని, ఏడుగురికి మించి రావద్దని, కేవలం ఐదు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి పంపించాలని గైడ్​లైన్స్​లో వెల్లడించారు. వేలిముద్రల తర్వాత శానిటైజర్​ చేసుకోవాలని, అందుబాటులో పెట్టాలని సూచించారు.
ప్రతి దీని కోసం రిజిస్ట్రేషన్లకు వెళ్లే వారు కచ్చితంగా స్లాట్​ బుకింగ్​ పత్రాలు, రిజిస్ట్రేషన్​ ధృవీకరణ పత్రాలను పోలీసులకు చూపించాల్సి ఉంటోంది. అయితే ప్రస్తుతం లాక్​డౌన్​ మినహాయింపు సమయంలోనే ఈ రిజిస్ట్రేషన్లు జరుగనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం 1 గంటకే కార్యాలయాలన్నీ మూత పడుతాయని వెల్లడించారు. ఆ తర్వాత ఏమైనా ఆలస్యం అయితే ఈ పత్రాలను చూపించాల్సి ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు చెప్పుతున్నారు. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే టోల్​ ఫ్రీ నెంబర్​ 18005994788కు కాల్​ చేయాలని, లేని పక్షంలో 9121220272కు వ్యాట్సాప్​ చేయాలని ప్రకటించారు.

నెక్లెస్​ రోడ్డుకు పీవీ నర్సింహరావు మార్గ్​గా నామకరణం

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పీవీ నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ ఆర్) గా నామకరణం చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. అదే విధంగా ఇప్పుడు అమలు చేస్తున్న బిసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలి

రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయం మీద కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలోని రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని,రైతు శిక్షణాకార్యక్రమాలను నిరంతరం జరపాలని, రైతుబంధు సమితి సంఘాల అధ్యక్షులు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఇందులో పాల్గొనాలని, ఏఈవో క్లస్టర్లలో డీఏవోలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికలను కేంద్రంగా చేసుకోని వ్యవసాయ శాఖ విధులను పర్యవేక్షించాలని, రైతులతో నిరంతరం సమావేశం కావాలని కేబినెట్ సూచించింది. రైతులకు వానాకాలంలో వరి, కంది, పత్తి పంటల సాగుపై అవగాహన కల్పించాలని, వరి నాట్లు కాకుండు వెదజల్లే పద్దతిని అవలంబించాలని రాష్ట్ర రైతాంగానికి కేబినెట్ పిలుపునిచ్చింది. వానకాలం వ్యవసాయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సిన విత్తనాల లభ్యత, ఎరువులు,ఫెస్టిసైడ్లు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖను కేబినెట్ ఆదేశించింది. కల్తీ విత్తనాలు, ఎరువులు, కల్తీ పురుగు మందులు తయారీదారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయ శాఖతో పాటు హోంశాఖ, ఇంటిలిజెన్స్ అధికారులను కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖలో రెండు అడిషనల్ డైరక్టర్ పోస్టులను మంజూరు చూస్తూ కేబినెట్ నిర్ణయించింది. దీనికితోడుగా రాష్ర్టంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం తొమ్మిది నుంచి పది క్లస్టర్లను ఎంపిక చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించాలని కేబినెట్ ఆదేశించింది.

కేంద్రం తీరుపై అసంతృప్తి

రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతుందని, దీంతో రైస్ మిల్లులను మరింతగా ఏర్పాటు చేయాల్సిన ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖను కేబినెట్ ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తిగా చేపట్టకుండా రాష్ట్రంపట్ల కేంద్రం అవలంబిస్తున్న అనుచిత వైఖరి గురించి కేబినెట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో 87 శాతం ధాన్యం సేకరణ జరగడంపై కేబినెట్​ సంతృప్తి తెలిపింది. కొనుగోళ్లను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని, వరి ధాన్యంలో సన్నాలకు మార్కెట్​లో డిమాండ్​ వుంటుందని, పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం డిమాండు రోజు రోజుకూ తగ్గుతున్న నేపధ్యంలో వరి కన్నా భవిష్యత్తులో పత్తికే ఎక్కువ లాభాలొస్తాయని కేబినెట్ అంచనా వేసింది. మార్కెట్లో డిమాండ్​ ఉన్న కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు కేబినెట్ సూచించింది.

రైతుబంధు ఆర్ధిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు రైతులకు అందించాలని, యాసంగిలో జమ చేసిన విధంగానే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. జూన్ 10 కటాఫ్​గా పెట్టుకుని.. పార్ట్ బి నుంచి పార్ట్ ఏ లోకి మారిన భూముల వివరాలను అప్​డేట్ చేసుకోవాలని ఆదేశించింది.

గృహ నిర్మాణ ఇండ్లను అమ్మండి

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ భూములు, గృహ నిర్మాణ సంస్థ ఇండ్ల అమ్మకాలను ముందు తెచ్చారు. కరోనా కారణంగా రాష్ట్రం కోల్పోతున్నామని కేబినెట్​ అభిప్రాయపడింది. ఈ ఆదాయాన్ని సమీకరించుకునేందుకు తీసుకునే చర్యలను కేబినెట్​ చర్చించింది. ప్రభుత్వ భూముల అమ్మకం, గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలో వున్న భూములు, ఇండ్ల అమ్మకం కోసం తక్షణమే చర్యలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూములు, ఇండ్ల అమ్మకం త్వరలోనే మొదలుకానుంది.

Next Story