హైదరాబాదు రెడ్ జోన్ కాదా?

by  |
హైదరాబాదు రెడ్ జోన్ కాదా?
X

దిశ, న్యూస్ బ్యూరో :

గ్రేటర్ పరిధిలో రెడ్‌జోన్ నిబంధనలు అమలు చేస్తామని, భౌతిక దూరంతో పాటు లాక్‌డౌన్ వర్తిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ మద్యం దుకాణాలు తెరవడంతో ఒక్కరోజులోనే పరిస్థితి తలకిందులైంది. మందు కోసం జనం రోడ్డెక్కారు. దుకాణాల ముందు బారులు తీరారు. నిన్నమొన్నటిదాకా ఖాళీగా ఉన్న రోడ్లపై రయ్మంటూ వాహనాలు పరుగులెత్తాయి. చెక్‌పోస్టుల దగ్గర పోలీసుల సంఖ్య తగ్గిపోయింది. ఇంతకాలం మందులషాపుకు వెళ్ళేవారి దగ్గర డాక్టర్ చీటీలను చూసి పంపేవారు పోలీసులు. ఇప్పుడు చెక్‌పోస్టుల దగ్గరుండే పోలీసులంతా మద్యం దుకాణాల దగ్గర డ్యూటీ చేస్తున్నారు. చెక్‌పోస్టు దగ్గర ఉండే పోలీసులు మందుకోసం వెళ్తున్నామంటే వదిలేశారు. దుకాణాల దగ్గరుండి మరీ మద్యం అమ్మించారు. బుధవారం నాటి పరిస్థితి చూస్తే అసలు గ్రేటర్ హైదరాబాద్ రెడ్‌జోన్‌లో ఉందా అనే అనుమానం కలుగక మానదు.

హైదరాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉంటాయని, మిగతా రాష్ట్రమంతా కొన్ని సడలింపులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సీఎం ప్రకటించారు. మద్యం దుకాణాలు తెరవడంతో ఇంతకాలం ఇండ్లకే పరిమితమైన బైక్‌లు, కార్లు రోడ్డెక్కాయి. మద్యం దుకాణాల ముందు వందల సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. వేసవి ఎండ సైతం వారికి అడ్డుకాలేదు. లైన్ నుంచి పక్కకు తప్పుకోలేదు. కొంతమంది ముందుచూపుతో ఇంటి నుంచి గొడుగులు తెచ్చుకొని మరీ లైన్లలో నిలబడ్డారు. మారేడ్‌పల్లిలోని ఓ వైన్ షాపు ముందు ఎండకు తట్టుకోలేక చెప్పులను లైన్లో పెట్టారు. కొండాపూర్, మాదాపూర్, పంజాగుట్ట ఏరియాల్లోని వైన్స్ ముందు మహిళలు క్యూలైన్లలో కనిపించారు. ఐటీ కారిడార్‌లో మగువలు మద్యం కొనుగోళ్ల కోసం ఎగబడ్డారు. సుమారు 45 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో బాటిళ్ల కొద్దీ కొనుగోళ్లు చేశారు.

గ్రేటర్‌లో రెడ్‌జోన్ ఉందా?

రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో మెజారిటీ భాగం గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రెడ్‌జోన్‌లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు. అయితే వైన్ షాపుల్ని తెరవడంతో లాక్‌డౌన్ ఆంక్షలు పలుచబడ్డాయి. వైన్స్ దుకాణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నా.. చాలా చోట్ల అమలుకాలేదు. బైక్‌పై ఒక్కరే ప్రయాణించాలని, వాహనాల్లో డ్రైవర్‌తో పాటు ఇంకొకరు మాత్రమే ఉండాలనే నిబంధనా అమలు కాలేదు. పోలీసులకు వాహనాలు ఆపే అవకాశమే లేకుండాపోయింది. రెడ్‌జోన్‌లో మద్యం దుకాణాలు మూసివేస్తారని అనుకున్న ప్రజల ఊహలను తలకిందులుగా చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో రోడ్లపై రద్దీ పెరిగింది. ఇంతకాలం కంట్రోల్‌లో ఉన్న పరిస్థితి ఒక్కరోజులోనే గందరగోళమైందని, కరోనా విజృంభిస్తే 40 రోజులు పడిన కష్టం బూడిదలో పోసినట్లేననే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Tags: Hyderabad, Lockdown, corona, wines, Telangana

Next Story

Most Viewed