అబ్బా.. ఈ దుర్గంధం భరించలేకపోతున్నాం.. కొంపలో ఉండి కూడా కూడు తినలేకపోతున్నాం

by  |
Dhamera1
X

దిశ, పరకాల(దామెర): జనావాసాల మధ్య ప్లాస్టిక్ రీ-సైక్లింగ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడంతో దాని ద్వారా వెలువడే దుమ్ము ధూళితోపాటు సౌండ్ పొల్యూషన్ మూలంగా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన గుట్ట కింది కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ నుండి గానీ, పొల్యూషన్ బోర్డ్ నుండి గానీ ఎలాంటి అనుమతులు లేకుండా పాత ఇనుప సామాను, ప్లాస్టిక్, తదితర వ్యర్థాలను నిలువ చేస్తూ రీ-సైక్లింగ్ చేస్తుండడంతో దాని ద్వారా వెలువడే దుమ్ము ధూళి, దుర్గంధం వలన చర్మ, శ్వాసకోస, తదితర వ్యాధులతో అనారోగ్యాల బారిన పడుతున్నామంటున్నారు. రీ-సైక్లింగ్ జరుగుతున్న సమయంలో వెలువడుతున్న దుర్గంధం భరించలేనిదిగా ఉంటుందని, కొంపలో ఉండి కూడా కూడు తినలేని దుస్థితి నెలకొందని గుట్ట కింది కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రీ-సైక్లింగ్ యంత్రాలను తొలిగించకపోగా తమపైనే తప్పుడు కేసులు పెడతామంటూ అధికారులు బెదిరిస్తున్నారని భాషబోయిన ఐలయ్య దిశ పత్రిక రిపోర్టర్ కు తెలియజేశాడు. గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడంలేదని నోటీసులకే పరిమితమవుతూ ఆ యజమానితో లాబీయింగ్ జరుపుతున్నారని ఆరోపించారు. రీ-సైక్లింగ్ యంత్రాన్ని తొలగించపోతే ఈ కాలనీలో ఉండలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి రీ-సైక్లింగ్ యంత్రాన్ని తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇంట్లో కూడు కూడా తినలేని పరిస్థితి: కాలనీ వాసి ఐలయ్య

రీ-సైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన యజమాని నా సోదరుడే. కానీ, ఆ రీ-సైక్లింగ్ యంత్రం మూలంగా వెలువడే దుమ్ము ధూళి, దుర్గంధాన్ని మేం భరించలేకపోతున్నాం. నా పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. సౌండ్ పొల్యూషన్ మూలంగా గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయంలో అనేక మార్లు గ్రామపంచాయతీకి ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్లు నోటీసులిచ్చి వదిలేస్తున్నారు తప్ప చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిని తొలగించాల్సిన అవసరం ఉన్నది.

Next Story