సందట్లో 'ఇదే'మియా!

by  |
సందట్లో ఇదేమియా!
X

దిశ, కరీంనగర్: సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా తయారైంది బ్లాక్ మార్కెట్ వ్యాపారుల తీరు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మన దేశాన్ని తాకడం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలను భయాందోళనకు గురిచేయడం అందరికీ తెలిసిందే. దీంతో కేంద్రం జనాతా కర్ఫ్యూ ప్రకటించి, లాక్‌డౌన్ చేయడంతో భారతఆర్థిక వ్యవస్థ దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ ఈ బ్లాక్ మార్కెట్ గాళ్లతో సామాన్యుడు చతకిలపడుతుండగా ఆ వ్యాపారులు మాత్రం నాలుగు రోజుల్లోనే నాలుగు అంతస్థుల భవనం కట్టుకునేలా దందా చేస్తున్నారు.

దొంగతనంగా దాచుకున్న మద్యం అమ్మేందుకు వారు చెప్తున్న రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. కానీ తమ బాడీకి ఆల్కహాల్ అందక షేక్ అవుతుండడం గమనించిన బాధితులు ఎంత రేటైనా చెల్లించి కొంటున్నారు. వందల్లో అమ్మాల్సిన మద్యాన్ని, వేల రూపాయలకు విక్రయిస్తుండడంతో బులియన్ మార్కెట్‌ను మరిపించే విధంగా ధరలు క్షణ క్షణం మారిపోతున్నాయి. జనతా కర్ఫ్యూ ఉందని ముందే తెలవడంతో మద్యం దాచుకున్న వ్యాపారుల పంట పండిందనే చెప్పాలి. క్లైమెట్ సహకరించక రైతులు పండించిన పంట చేతికి రాక లబోదిబోమంటున్న తరుణంలో పంట గిట్టుబాటు ధర లక్షల్లో పలికినట్టుగా తయారైంది అక్రమ మద్యం వ్యాపారుల తీరు.

రూ.500 ఎమ్మార్పీ రేటున్న ఫుల్‌బాటిల్ రూ.2వేల కూడా పలుకుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే 2,500 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. కొన్ని చోట్ల మందు బాబుల పరిస్థితి అయితే జూదరుల కన్నా అధ్వాన్నంగా తయారైంది. తమకు మందు దొరికితే చాలు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టయినా కొంటామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదీ బ్లాక్ మార్కెట్ దందా గాళ్లకు అవకాశంగా మారింది. రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ 2 వేల రూపాయలకు అమ్ముతుండగా ఇంపీరియల్ బ్లూ బాటిల్ 1600 రూపాయలకు విక్రయిస్తున్నారు. కాస్ట్లీ లిక్కర్ రేట్లయితే సరే సరి అన్నట్టుగా ఉంది నల్ల బజారులో. బ్లాక్ డాగ్ 3 వేలు, బ్లాక్ అండ్ వైట్ 3,500లకు కూడా అమ్ముతున్నారు.

తెల్లవారు జామునే ఎంట్రీ

కరోనా కారణంగా పొద్దంతా కష్టపడి పనిచేస్తున్న పోలీసులు తెల్లవారు జామున కునుకు తీస్తుంటారు. 2గంటల నుండి పట్టణ ప్రాంతాల్లోకి వచ్చే కూరగాయల రైతులు, పాల విక్రయదారుల కోసం ‘దారులు’ బార్ల తెరుస్తున్నారు. అదే సమయంలో కొంతమంది పాలు, వెజిటేబుల్స్ మాటున మద్యాన్ని పట్టణాలకు తరలిస్తున్నారు. వచ్చి రాగానే ఫస్ట్ లిక్కర్ బాటిల్స్ డంప్ అవుతున్నాయి. తెల్లవారే సరికి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

వీరూ అసలు దొంగలు..

జీరో మద్యం వచ్చే పరిస్థితి ఇతర రాష్ట్రాల నుండి లేదు. కేవలం నిత్యవసరాలకు మాత్రమే ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఉన్న కొద్ది మద్యంతో కోట్లు సంపాదించుకోవాలనుకున్న వారు అడ్డంగా ప్లాన్ చేసేసుకుంటున్నారు. జనతా కర్ఫ్యూకు ముందు ఎక్సైజ్ శాఖ నుండి లిక్కర్ తెప్పించుకున్న బ్రాందీ షాపులు, బార్ల యాజమాన్యాలు పెగ్ సిస్టంతో సంపాదించిడం ఎందుకు..? క్యాప్ సిస్టంతో డబ్బు సంపాదించుకోవాలనుకున్నాయి. అంతే అదే స్థాయిలో రేట్లు పెంచేశాయి కూడా. మీడియేటర్ సిస్టంతో వారు చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. లైసెన్స్‌తో సర్కార్‌కు డబ్బులు కట్టి మరీ టైం సెన్స్ పాటించి నామమాత్రపు లాభాలతో కాలం వెల్లదీసిన వారంతా కేవలం గంటల్లోనే లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

ఆకలి రుచి ఎరుగదు, నిద్ర చోటెరగదు అన్నట్టుగా మందు బాబుల పరిస్థితి తయారైతే అందివచ్చిన ఆ అవకాశాన్ని చే జార్చుకోవడం లేదు అక్రమ దందా గాళ్లు. మద్యస్థంగా ధర ఉండే లిక్కర్‌ను కల్తీ చేసి విక్రయిస్తున్న వారూ తయారయ్యారు. కరువు కాలంలో వర్షం పడిందన్నట్టుగా మందుబాబులు తీసుకెళ్తున్న మద్యంలో స్పిరిట్ కూడా కలిపి ఎన్ క్యాష్ చేసుకునేంత సాహసం చేస్తున్న వారూ లేకపోలేదు. అసలే లాక్‌డౌన్ అవకాశం వచ్చినప్పుడు వెనకా ముందు ఆలోచించకుండా మందు బాబుల ప్రాణాలే ఫణంగా పెట్టి సంపాదించుకోవాలనుకున్న వారు ఇష్టాను సారంగా కల్తీ చేసేస్తున్నారు.

Tags: Black Market, Liquor, Beer, Merchants, Bars, Wines, Lockdown, Telangana, Curfew

Next Story

Most Viewed