అటెండర్లకు షాకిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు.. పొద్దున్నే అలా దర్శనమిస్తూ

by  |
అటెండర్లకు షాకిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు.. పొద్దున్నే అలా దర్శనమిస్తూ
X

దిశ,ఖానాపూర్ : రాత్రి వేళలో ప్రభుత్వ కార్యాలయాలు మందు బాబులకు అడ్డగా మారుతున్నాయి. తాజాగ వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ప్రభుత్వ కార్యాలయాలను మందు బాబులు అడ్డగా ఎంచుకున్నట్టున్నారు. పగలు ఉద్యోగులతో రద్దీగా ఉండే కార్యాలయాలు చీకటి పడ్డాక నిర్మానుష్యంగా ఉంటాయి. ఇదే మందుబాబులకు అవకాశంగా మారింది. చీకటి పడ్డాక అసాంఘిక కార్యకలాపాలకు తెర లేపుతున్నారు. చీకట్లో ఇటు వైపు ఎవరు రారు అన్న ధీమానో ప్రభుత్వ కార్యాలయాలే కదా అన్న చులకన భావమో కానీ, కార్యాలయ ఆవరణంలో తాగడమే కాకుండా గాజు సీసాలని పగలగొట్టి ప్రాంగణం మొత్తం చెత్తతో నింపేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ఆకతాయిల ఆటవిడుపు కేంద్రాలుగా మారాయి. కేవలం మందు మాత్రమే తాగుతున్నారా ఇంకా మత్తుపదార్థాల సేవనం కూడా జరుగుతుందా..అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

వివరాల్లోకి వెళితే .. గురువారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం, మండల విద్యావనరుల కేంద్రానికి విధులకు వెళ్లిన అటెండర్‌లకు కార్యాలయ మెట్ల మీద, జాతీయ జెండా ఆవిష్కరణగావించే గద్దె మీద పదుల సంఖ్యలో బీరు బాటిల్ , మందుసీసాలు తాగి పడేసిన సిగరెట్ పీకలు, మందు అట్టపెట్టలు దర్శనమిచ్చాయి. కార్యాలయ అటెండర్ యుగేందర్ తొలగించి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసాడు. ప్రభుత్వ కార్యాలయంలో కాదు బెల్ట్ షాప్, బ్రాందీ షాప్‌లో క్లీనింగ్ పనిచేసినట్లు ఉందని వారు వాపోయారు. ఇక మండల పరిషత్ కార్యాలయం పక్కనే ఉన్న విద్యా వనరుల కేంద్రం వరండాలో అయితే ఏకంగా బీరు కాటన్ ఖాళీ సీసాలతో తాగి పడేసి వెళ్లడమే కాకుండా సీసాల్ని పగలగొట్టి వెళ్లారు. కార్యాలయ పనిచేసే ఆమె మహిళ కావడంతో వాటిని ఆమె తీసివేయడం కష్టంగా ఉండి తన భర్త‌ని పిలిపించుకుని శుభ్రం చేసుకొనే పరిస్థితి కలగజేశారు.

ఇప్పటికే గంజాయి పెద్ద ఎత్తున సేవిస్తూ చిత్తయిపోతున్న యువత ఇలా తాగిన మైకంలో సీసాల్ని పగలగొట్టడమే కాదు కార్యాలయ కిటికీలను విరగ్గొట్టారు. తాగిన తర్వాత కిటికీల పక్కనే మలమూత్ర విసర్జన చేసి పరిసరాల్ని అపరిశుభ్రం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కార్యాలయాల్లో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ పాఠశాలలు,దూరంలో ఉన్న ఇతర కార్యాలయంలలో వస్తువులకు భద్రత లేదని అధికారులు భయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అశోకనగర్ జడ్పీ పాఠశాలలో ఆకతాయిలు పాఠశాల ఆవరణలో తాగి సీసాల్ని పడేసి, ఆఫీస్ రూమ్ తలుపులు పగలగొట్టారు. అప్పుడు కూడా ప్రజాప్రతినిధులు,అధికారుల దృష్టికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకువెళ్లారు. ఇలాంటి సంఘటనే ఖానాపూర్ పాఠశాల ఆవరణలో జరిగితే పోలీసులు కొన్నిరోజుల పెట్రోలింగ్ నిర్వహించి వదిలేశారు.

దూరంగా పాఠశాలల నుండి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కార్యాలయాల వద్దకు ఆకతాయిల ఆగడాలు, అకృత్యాలు వచ్చాయంటే పరిస్థితి ఎంత అపాయకరంగా మారిందో తెలుస్తోంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే గంజాయి మత్తు ప్రభలుతున్న మండల కేంద్రంగా అపకీర్తి మూటకట్టుకున్న మండల కేంద్రానికి ఇలాంటి వ్యక్తులు మచ్చ తెస్తున్నారంటున్నారు. పెడదారి పట్టిన యువతని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి శాంతి భద్రతల కాపాడాల్సిన బాధ్యత మాత్రం ముమ్మాటికీ పోలీసులదే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎటు వెళుతున్నారు, ఎవరితో వెళుతున్నారు, ఎందుకోసం వెళుతున్నారు అనే విషయంపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.

పోలీసుల‌కి ఫిర్యాదు చేస్తా

మా కార్యాలయం ముందు, పక్కనున్న ఎం.ఆర్.సీ కార్యాలయంలో ఆకతాయిల గుంపు మద్యం సేవించి,సీసాల్ని సిగరెట్ పీకల్ని అక్కడ పడవేసి వెళ్లారు. జాతీయ జెండా ఎగురవేసే గద్దెపై కూడా ఇవన్నీ పడవేశారు. పోలీసు వారిని ఇక్కడ సీ.సీ కెమెరా ఏర్పాటు చేయమని కోరుతాను. అలాగే తాగి, ఆగడాలు చేసిన వ్యక్తులని కనిపెట్టి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికి తెలియజేస్తాం.

ఎంపీడీఓ సుమనవాణి



Next Story

Most Viewed