నష్టాల భర్తీకే సరి.. ఉద్దీపన అమలుకేది మరి?

by  |
నష్టాల భర్తీకే సరి.. ఉద్దీపన అమలుకేది మరి?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా సృష్టించిన నష్టం అంతాఇంతా కాదు. లాక్‌డౌన్ 50 రోజుల పైబడే కొనసాగుతుండటంతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇక రాష్ట్రాల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్రాలు కేంద్ర వైపు ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా పలు ఉద్దీపన పథకాలు అమలు చేస్తామని ప్రకటనలు చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు ఈ ఉద్దీపణ పథకాల అమలు ప్రస్తుతం పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్ననే లేవనెత్తింది ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్. అసలు ఈ సంస్థ ఏఏ అంశాలు లేవనెత్తిందో ఓసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే అప్పులన్నీ ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకే సరిపోతాయని, ఇక ఉద్దీపన పథకాలకు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయని ఇండియా రేటింగ్స్ ప్రశ్నించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం రూ. 4.32 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.1.48 లక్షల కోట్ల తగ్గుతుందని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది రూ.7.8 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించింది. అర్ధాంతరంగా కరోనా సంక్షోభం తలెత్తడంతో మరో రూ.4.2 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది. అంటే మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయనుంది. అయితే ఈ మొత్తం ఈ ఏడాది రావాల్సిన ఆదాయం నష్టాన్ని భర్తీ చేసేందుకే సరిపోతుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ఈ లెక్కన ఉద్దీపన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది. ఉద్దీపన పథకాలు అమలు చేయాలంటే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూలధన వ్యయాన్ని బాగా తగ్గించుకుని, ప్రాధామ్యాలు మార్చుకుంటే ఉద్దీపన పథకాలకు నిధులు కేటాయించొచ్చని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో 95.1 శాతం ఆదాయ నష్టం భర్తీకే సరిపోతుందని, ఇక మిగిలేది 4.9 శాతం అంటే 20,000 కోట్ల రూపాయలేనని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. 2012 నుంచి 2019 వరకు కుటుంబ పొదుపు 44.3 శాతం ఉండగా.. ఇప్పుడవి క్షీణ దశలో ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వద్ద ఉన్న వనరులు పరిమితమేనని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

Next Story

Most Viewed