కిడ్నీ ఫెయిల్యూర్ సైలెంట్ కిల్లర్ ఎందుకు అవుతుంది?

by Naga Rani Yarlagadda |

మానవ శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. అయితే అవి పూర్తిగా ఫెయిలయ్యేంత వరకూ ఎలాంటి సంకేతాలు కనిపించవు. అలసట, వాపు లాంటి చిన్న లక్షణాల ద్వారా హెచ్చరించినా, శరీరం వాటిని తట్టుకుని ముందుకెళ్తుంది.

కిడ్నీ ఫెయిల్యూర్ సైలెంట్ కిల్లర్ ఎందుకు అవుతుంది?
X

దిశ, వెబ్‌డెస్క్: మానవ శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. అయితే అవి పూర్తిగా ఫెయిలయ్యేంత వరకూ ఎలాంటి సంకేతాలు కనిపించవు. అలసట, వాపు లాంటి చిన్న లక్షణాల ద్వారా హెచ్చరించినా, శరీరం వాటిని తట్టుకుని ముందుకెళ్తుంది. ఈ లక్షణాలు అనేక సందర్భాల్లో నిర్లక్ష్యం చేయబడతాయి. అందుకే మూత్రపిండాల వైఫల్యాన్ని “సైలెంట్ కిల్లర్” అంటారు. కానీ దీనిపై చైతన్యం, సకాలంలో పరీక్షలు, శరీర లక్షణాలను జాగ్రత్తగా గమనించడం ద్వారా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నివారించవచ్చు.

మూత్రపిండాల పనితీరు మందగిస్తే.. ఇతర అవయవాలు నిశ్శబ్దంగా ఆ భారాన్ని మోస్తాయి. కాలేయం (liver) కొంతవరకూ వ్యర్థాలను తొలగించేందుకు సహాయపడుతుంది. అలసట, మలబద్ధకం, కళ్ల చుట్టూ వాపు వంటి చిన్న లక్షణాలు కనిపించినా.. అవి సాధారణ సమస్యలుగా తీసుకుంటారు. 90 శాతం పనితీరు కోల్పోయేంతవరకూ స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం ఈ వ్యాధిని ప్రమాదకరంగా మారుస్తుంది.

నోట్లో మెటలిక్‌ రుచి, కాళ్ల వాపు వంటివి సాధారణంగా అనిపించినప్పటికీ.. అవి మూత్రపిండాల ఫెయిల్యూర్ కి సంబంధించిన సంకేతాలు. మూత్రంలో ప్రొటీన్ల లీకేజీ ప్రారంభం.. ప్రారంభ లక్షణాల్లో ఒకటి అయినా, దీనికి బాధ కలిగించకపోవడంతో ఎక్కువగా పరీక్షలు చేయించుకోవడం జరగదు.

ఈ వ్యాధి మధుమేహం, అధిక రక్తపోటు, ఎక్కువకాలం పెయిన్‌కిల్లర్లు తీసుకోవడం వంటివాటితో మొదలవుతుంది. వీటిని ఎక్కువగా మూత్రపిండాలకు సంబంధించి పరిగణించరు. మధుమేహం కారణంగా కలిగే ‘డయాబెటిక్ నెఫ్రోపతి’ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి ప్రధాన కారణం.

చాలా ఆరోగ్య పరీక్షల్లో కొలెస్ట్రాల్‌, రక్తంలో చక్కెర స్థాయిలు, కాలేయం పనితీరు తెలుస్తుంది. కానీ మూత్రపిండ పనితీరును కొలిచే ‘క్రియాటినిన్’ లేదా ‘జీఎఫ్ఆర్‌’ (GFR) పరీక్షలు పెద్దగా చేయరు. ఇదే మూత్రపిండాల సమస్యలను ముందుగా గుర్తించడంలో ప్రధాన అవరోధంగా మారుతుంది.

చివరిదశలో లక్షణాలు హఠాత్తుగా తలెత్తుతాయి. అలజడి, మూర్ఛలు, గుండె సమస్యలు మొదలై డయాలసిస్‌ లేకపోతే ప్రాణాపాయం ఏర్పడుతుంది. ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ అనే ఆకస్మిక మూత్రపిండ వైఫల్యం మాదిరిగానే.. కొంతమంది ఎటువంటి హెచ్చరికలు లేకుండానే చివరి దశకు చేరుకుంటారు.

అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, మౌనంగా వచ్చే ఈ ముప్పును నివారించవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు లేదా తరచూ పెయిన్‌కిల్లర్లు వాడేవారు రెగ్యులర్‌గా మూత్రపరీక్షలు, రక్తపరీక్షలు చేయించుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. కానీ “డిటాక్స్‌ డ్రింక్స్‌” వంటి వాటిని వైద్యుల సలహా లేకుండా తీసుకోవద్దు. అవసరం లేని ఏ మందులు (ప్రత్యేకించి ఇబుప్రోఫెన్, డైక్లోఫెనాక్‌ వంటివి) ఎక్కువగా వాడకుండా ఉండాలి. రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచాలి. శరీరంలో అలసట, వాపు, మూత్రంలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

Next Story