ట్రోలైన చోటే.. వైరలై.. కోట్లు సంపాదిస్తోంది.!

by Daayi Srishailam |

పావని వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఫ్రాంచైజీల ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

ట్రోలైన చోటే.. వైరలై.. కోట్లు సంపాదిస్తోంది.!
X

దిశ, ఫీచర్స్: తమ పని తాము చేసుకోక ఇతరుల పనిలో వేలు పెట్టేవాళ్లే ఎక్కువ సోషల్ మీడియాలో. ఏపీకి చెందిన పావని మాడుగుల అందరిలా టైంపాస్ కోసం కాకుండా సోషల్ మీడియాను అర్థవంతంగా వాడుకోవాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తుంటే ట్రోల్ చేశారు కొంతమంది పనికిమాలిన వాళ్లు. ఇక్కడే తన సత్తా ఏంటో చూపెట్టాలని డిసైడయింది పావని.

పెళ్లితో చదువుకు బ్రేక్..

పావనికి 22 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు పేరెంట్స్. చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఉన్న తనకు పెళ్లి చేయడంతో బాధ పడింది. గత్యంతరం లేక తనకు ఇష్టమైన ఎంబీఏని వదులుకుంది. బేసికల్‌గా తనెప్పుడూ చదువులో టాపరే. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అద్భుతమైన మార్కులు సాధించి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసింది. పుణెలోని సింబయోసిస్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు కూడా సంపాదించింది. ఫీజు కూడా కట్టేశారు. కానీ.. తన జీవితం అనూహ్య మలుపు తిరిగి ఎంబీఏ కోర్సు ప్రారంభంకాగానే పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ పరిస్థితుల వల్ల పెళ్లికి ఓకే చెప్పి ఎంబీఏను వదులుకోవాల్సి వచ్చింది.

ఏదో కోల్నోయిన ఫీలింగ్..

పెళ్లి తర్వాత అత్తగారింటికి షిప్ట్ అయ్యారు. ఆ ఊరు విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక మహిళలకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతం అది. చూడటానికి ప్రశాంతంగా బతకొచ్చని అనిపించినా ఏదో సాధించాలనే పట్టుదల ఉన్న పావనిలాంటి వాళ్లకు నిరాశే. పావనికి ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించేది. తన స్నేహితులంతా డాక్టర్లు.. ఇంజినీర్లుగా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరిపై ఆధారపడకుండద సొంతంగా సంపాదిస్తున్నారు. పావనికీ డబ్బు ఉంది. కానీ అది తన సొంతం కాదుగా అనే ఫీలింగ్.

తీవ్రమైన ట్రోలింగ్..

కెరీర్ ఆందోళనలు ఆమెను కొత్త మార్గం వైపు నడిపించాయి. తన స్నేహితుల మాదిరి తనకెలాంటి వ్యాపార అవకాశాలు కనిపించలేదు ఊర్లో. అందుకే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం ప్రారంభించింది. ఐతే ఇది వ్యాపారం కోసం కాదు.. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. భర్త.. తల్లిదండ్రులు మద్దతిచ్చారు. కానీ సమాజం వ్యతిరేకించింది. పెళ్లయిన మహిళ రీల్స్ చేయడం సమాజానికి సమస్యగా మారింది. "నీకు డబ్బెందుకు? ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నావ్?" అంటూ కామెంట్లు.. ట్రోలింగ్ ఎదుర్కొంది. బంధువులు కూడా విమర్శించారు. ఎవరేమనుకున్నా నేను నాలాగే ఉంటా అని ముందుకెల్లింది.

20 వేల కస్టమర్లు..

సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించింది. ఇదే తర్వాత వ్యాపారానికి పునాది అయింది. 2025 సెప్టెంబర్లో పావని వీడియో పోస్ట్ చేసింది. గ్రామంలో తయారయ్యే సాంప్రదాయ గోధుమ హల్వా తయారీకి సంబంధించిన వీడియో అది. హెల్దీ స్వీట్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ వీడియో వైరలైంది. దీంతో ఆర్డర్లు స్టార్టయ్యాయి. మొదటి నెలలోనే రూ.18 లక్షల టర్నోవర్ సాధించింది. ఇదే ఉత్సాహంతో ఎలాంటి మూలధనం.. ఫ్యాక్టరీ లేకుండా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సేల్స్‌తో 20 వేల మంది కస్టమర్లను సంపాదించింది.

ఫ్రాంచైజీల ఏర్పాటుకు..

రిస్క్ ఎక్కువే ఉండేది. రవాణా సౌకర్యంలేక ఎన్నో సమస్యలొచ్చేవి. మొదట ఇండియా పోస్ట్ ఉపయోగించారు. తర్వాత డెలివరీ.. డీటీడీసీకి మారారు. వాటన్నింటినీ ఎదుర్కొని పావని ఇప్పుడు రోజుకు 80-100 కిలోల హల్వా అమ్ముతోంది. పండుగల్లో మరిన్ని. టర్నోవర్ రూ.1 కోటి దాటింది. వెబ్‌సైట్ లేకుండా ఇన్‌స్టాగ్రామ్.. వాట్సాప్.. రేజర్‌పే ద్వారా ఆర్డర్లు తీసుకుంటుంది. తన సక్సెస్‌ను చూసి ట్రోలింగ్ చేసినవాళ్లే అభిమానులుగా మారిపోయారు. పావని వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.

Next Story