రియల్ ఎస్టేట్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ఎన్‌ఆర్‌ఐల పరిస్థితి ఇదే..

by Sujitha Rachapalli |

అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధం రియల్ ఎస్టేట్ రంగంపై కూడా పడింది. సిమెంట్, స్టీల్ రేట్లు పెరిగాయి. దీంతో ఇంటి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.

రియల్ ఎస్టేట్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ఎన్‌ఆర్‌ఐల పరిస్థితి ఇదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధం రియల్ ఎస్టేట్ రంగంపై కూడా పడింది. సిమెంట్, స్టీల్ రేట్లు పెరిగాయి. దీంతో ఇంటి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే విదేశాల్లో స్థిరపడిన వాళ్లు సొంత దేశంలో పెట్టుబడులు పెట్టడం మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నట్లు సమాచారం. అందుకే ఇక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్, ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ పూర్వాంకర లిమిటెడ్ స్పష్టం చేసింది. ప్రధానంగా గల్ఫ్‌లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు భారత్ లోనే ఆస్తులు కొనుగోలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

మిడిల్‌ ఈస్ట్‌లోని రియల్ కార్యాలయాల్లో ఈ మేరకు ఏకంగా 60 శాతం ఎంక్వయిరీలు పెరిగినట్లు సదరు సంస్థ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం విదేశాలలో నివసిస్తున్న భారతీయులు తమ పెట్టుబడి రూట్‌ను మార్చుకుంటున్నారు. అలాగే ఇండియాలో స్థిరమైన, ఆకర్షణీయమైన మార్కెట్‌ను ఎంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. స్థిరమైన, ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ రంగం వైపు మళ్లుతున్నారని పూర్వాంకర ఎండీ ఆశిష్‌ పూర్వంకర తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లోని వారి కార్యాలయాల్లో ఇటీవల 60 శాతం మేరకు ఎంక్వయిరీలు పెరిగినట్లు చెప్పారు. ప్రపంచ అనిశ్చితి, ఉద్యోగ భద్రతపై ఆందోళనలతో నిర్ణయాలు తీసుకోవడంలో తాత్కాలిక జాప్యం జరిగింది. అయితే గృహ డిమాండ్‌పై మొత్తం ప్రభావం స్వల్ప కాలికంగానే ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్త అంతరాయం ఎదురైనప్పుడు కాస్త ఆగి ఆలోచించడం మానవ సహజం. కానీ అటువంటి అంతరాయాలు సాధారణంగా రెండు నుంచి నాలుగు త్రైమాసికాలకు మించి కొనసాగవు. అంతిమంగా ప్రజలు భద్రత, రక్షణ కోసమే ఇల్లు కొనడానికి ఇష్టపడతారు. అందువల్ల గృహ కొనుగోలుదారుల నిర్ణయాలపై యుద్ధ ప్రభావం తాత్కాలికంగానే ఉంటుందన్నారు.

Next Story