ఏఐతో ఎక్జోటిక్ మొక్కల సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.!

by Daayi Srishailam |

ఇద్దరు స్నేహితులు క్రాప్ ఏఐ అనే హైడ్రోపోనిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించారు

ఏఐతో ఎక్జోటిక్ మొక్కల సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.!
X

దిశ, ఫీచర్స్: కర్ణాటకకు చెందిన కెల్విన్, ఫరీష్ అన్ఫాల్ అనే ఇద్దరు స్నేహితులు క్రాప్ ఏఐ అనే హైడ్రోపోనిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సాంకేతికత, ఆటోమేషన్‌ను సమన్వయం చేస్తూ పంటల నాణ్యతను, ఉత్పత్తిని మెరుగుపరిచే ఈ స్టార్టప్ ద్వారా లెట్యూస్, బాసిల్, కేల్ వంటి ఎక్జోటిక్ పంటలను సాగుచేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

లాభసాటి సాగు దిశగా..

సాంప్రదాయ వ్యవసాయం వల్ల నష్టాలొచ్చి రైతులు అప్పుల పాలవుతున్నారని గ్రహించి కెల్విన్, ఫరీష్ హైడ్రోపోనిక్స్‌లో కృత్రిమ మేధస్సును సమన్వయం చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కెల్విన్ బెంగళూరులో కార్పొరేట్ ఉద్యోగంలో చేరగా.. ఫరీష్ సీఫుడ్ వ్యాపారం చేసేవాడు. రైతులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు లాభదాయక వ్యవసాయం ఎందుకు చేయలేకపోతున్నారో అధ్యయనం చేసి.. రైతును లాభసాటి సాగు దిశగా నడిపిస్తున్నారు.

అనువైన వాతావరణం

2021లో కెల్విన్, ఫరీష్‌ కలిసి ఉడుపిలో ప్రోటోటైప్‌ను రూపొందించారు. నాలుగు నెలల్లో క్రాప్ ఏఐని ప్రారంభించారు. ఈ స్టార్టప్ సాంప్రదాయ పాలీహౌస్ ఫార్మింగ్‌కు ప్రత్యామ్నాయంగా కంటైనర్ ఫామ్ సెటప్‌లను అందిస్తోంది. రైతుల ఆదాయాన్ని వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతోంది. క్రాప్ ఏఐ 3డీ పైపులను రూపొందించి వర్టికల్ ఫార్మింగ్‌ను సాధ్యం చేసింది. ఇవి కాంతి స్పెక్ట్రం, ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. సాఫ్ట్‌వేర్ ఇన్‌పుట్‌ల ఆధారంగా నీటిపారుదల, ఉష్ణోగ్రత, తేమ, నీటి కండక్టివిటీ, గాలి ఉష్ణోగ్రత వంటి అంశాలను సరైన స్థాయిలో ఉంచి మొక్కలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

ఖర్చులను 50% తగ్గిస్తుంది

ఏఐ-ఆధారిత హైడ్రోపోనిక్స్ విధానం సాంప్రదాయ వ్యవసాయం కంటే 95% తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. ఎందుకంటే నీరు పునర్వినియోగం అవుతుంది. అలాగే ఖర్చులను 50% తగ్గిస్తుంది. సాంప్రదాయ వర్టికల్ ఫార్మింగ్‌లో ఒక కిలో స్ట్రాబెర్రీలను పండించడానికి రూ.800 ఖర్చయితే ఏఐ హైడ్రోపోనిక్స్‌తో కేవలం రూ.300 మాత్రమే అవుతుంది. ఇప్పుడు క్రాప్ ఏఐ రిటైల్ దిగ్గజాల కోసం ఫామ్ సెటప్‌లను నిర్మిస్తోంది. సరసమైన ధరలతో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తులను పండిస్తోంది. వారి సెటప్ ధర రూ.5 లక్షలు. ఇది 500 లెట్యూస్ మొక్కలను పండించే సామర్థ్యం కలిగి ఉంది.

టార్గెట్ రూ.3 కోట్ల టర్నోవర్..

క్రాప్ ఏఐ 2023లో కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐడియా2పీఓసీ/ఎలివేట్ గ్రాంట్‌ను బయోటెక్ రంగంలో గెలుచుకుంది. అలాగే స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద ఏఐసీ నిట్టే ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఇంక్యుబేట్ అవుతోంది. గత సంవత్సరం ఫామ్ స్టేషన్ల తయారీపై 40% స్థూల లాభంతో రూ.50 లక్షల ఆదాయాన్ని సాధించారు. ఈ సంవత్సరం రూ.3 కోట్ల వార్షిక టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలను ఇండోర్‌లో, సూర్యరశ్మి, పొలం లేకుండా పండించేలా చేస్తుంది. వ్యవసాయంలో సుస్థిరత, లాభదాయకతను పెంచడమే కాక వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని రైతులకు అందిస్తోంది.

Next Story